న్యూఢిల్లీ: హర్యానాలో భూమి కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు చార్జిషీట్లో ఈడీ అధికారులు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పేరును చేర్చారు. అయితే అందులో ప్రియాంకను నిందితురాలిగా పేర్కొనలేదు. ఇదే చార్జిషీట్లో ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా పేరును కూడా ప్రస్తావించారు. రాబర్ట్ వాద్రా 2006లో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా ద్వారా ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదేవిధంగా 2006లో అమీపూర్ గ్రామంలో హెచ్ఎల్ పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. ఈ భూముల కొనుగోలుకు ఆర్థిక లావాదేవీలన్నీ విదేశాల నుంచి అక్రమంగా జరిగాయని ఈడీ తేల్చింది. లావాదేవీలతో సంబంధమున్న ఎన్ఆర్ఐ, వ్యాపారవేత్త అయిన సీపీ థంపీ, సుమిత్ చద్దాలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఈ ఇద్దరి సహకారంతో భూముల కొనుగోలు ద్వారా ప్రియాంక గాంధీ, వాద్రా మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈడీ ప్రియాంక పేరును తొలిసారిగా చార్జిషీట్ లో నమోదు చేసింది.