- పల్టాన్ పట్టేసింది
- ఫైనల్లో హర్యానా స్టీలర్స్పై అద్భుత విజయం
- రూ. 3 కోట్ల ప్రైజ్మనీ సొంతం
హైదరాబాద్, వెలుగు: గతేడాది చిక్కినట్టే చిక్కి చేజారిన ప్రొ కబడ్డీ లీగ్ ట్రోఫీని పుణెరి పల్టాన్ ఈసారి ఒడిసిపట్టుకుంది. శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన తుదిపోరులో పల్టాన్ 28–25తో హర్యానా స్టీలర్స్పై గెలిచింది. అద్భుత ఆటతో వరుసగా రెండోసారి ఫైనల్కు వచ్చిన పుణెరి ఆఖరాటలో ఏ అవకాశాన్నీ చేజార్చుకోలేదు. పుణెరి స్టార్ రైడర్ పంకజ్ మోహితే కీలకమైన 4 పాయింట్ల సూపర్ రైడ్ సహా 9 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మోహిత్ గోయత్ (5), అస్లాం ఇనాందార్ (4), గౌరవ్ ఖత్రి (4) రాణించారు. తొలిసారి ఫైనల్కు వచ్చిన హర్యానా స్టీలర్స్ రన్నరప్తో సరిపెట్టింది. శివం (6), సిద్దార్థ్ దేశాయ్ (4), వినయ్ (3) పోరాడారు. నేషనల్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా వచ్చి పుణెరికి ట్రోఫీ అందజేశారు. పుణెరికి ట్రోఫీతో పాటు రూ. 3 కోట్లు, హర్యానా రూ. 1.8 కోట్లు ఖాతాలో వేసుకుంది.
పుణెరి జోరు..
సెకండాఫ్లో హర్యానా పుంజుకునే ప్రయత్నం చేసింది. కానీ, పుణెరి ఆ జట్టుకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. పంకజ్ మోహితే డబుల్ పాయింట్ రైడ్తో 23వ నిమిషంలో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన పుణెరి 18–-11తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. పూర్తి జట్టు మ్యాట్పైకి వచ్చిన తర్వాత కూడా హర్యానా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. డిఫెన్స్ బలంగా ఉన్నప్పటికీ అనవసర ట్యాకిల్స్తో పాయింట్లు కోల్పోయింది.
ఇంకోవైపు పుణెరి డిఫెండర్ ఇనాందర్ తన ఉడుం పట్టుతో స్టీలర్స్ రైడర్లకు అడ్డు గోడగా నిలిచాడు. దాంతో పుణెరి భారీ ఆధిక్యంతో మ్యాచ్ నెగ్గేలా కనిపించింది. చివరి నిమిషాల్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన సిద్దార్థ్ దేశాయ్ వెంటవెంటనే పాయింట్లు తెచ్చి ఉత్కంఠను రేకెత్తించాడు. కానీ ఆఖర్లో మరో తప్పిదానికి తావివ్వని పుణెరి ట్రోఫీ గెలిచి సంబరాలు మొదలు పెట్టింది.
- బెస్ట్ రైడర్- అషు మాలిక్ (దబాంగ్ ఢిల్లీ) -రూ. 15 లక్షలు
- బెస్ట్ డిఫెండర్-మొహమ్మద్ రెజా చియనే (పుణెరి) - రూ. 15 లక్షలు
- బెస్ట్ యంగ్ ప్లేయర్ -యోగేష్ (దబాంగ్ ఢిల్లీ) రూ. 8 లక్షలు
- మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ - అస్లాం ఇనామ్దార్ (పుణెరి) - రూ. 20 లక్షలు
హోరాహోరీ..
రెండు బలమైన జట్ల మధ్య ఆఖరాట నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఈ సీజన్లో డిఫెన్స్లో బెస్ట్ టీమ్స్ కావడంతో తొలి పది నిమిషాల ఆటలో కేవలం ఎనిమిది పాయింట్లే నమోదయ్యాయి. ఇరు జట్లూ బలమైన డిఫెన్స్తో ప్రత్యర్థి రైడర్లను నిలువరించాయి. దాంతో 4–4తో సమంగా నిలిచాయి. టైమౌట్ తర్వాత కూడా అలానే పోరాడుతూ7-–7తో నిలిచాయి. ఈ దశలో పంకజ్ మోహితే మ్యాచ్ను మలుపు తిప్పాడు.
ఫస్టాఫ్ చివర్లో డూ ఆర్ డై రైడ్కు వెళ్లిన అతను ఏకంగా నాలుగు పాయింట్లు పట్టుకొచ్చాడు. అతడిని ట్యాకిల్ చేసే ప్రయత్నంలో హర్యానా డిఫెండర్లు జైదీప్, వినయ్, రాహుల్, మోహిత్ ఔటయ్యారు. ఈ దెబ్బకు పుణెరి 13–9తో ఆధిక్యంలో రాగా.. కోర్టులో ఒకే ఆటగాడు నిలవడంతో హర్యానా ఆలౌట్ ప్రమాదంలో నిలిచింది. కానీ విశాల్ మెరుపు రైడ్తో బోనస్ సహా 2 పాయింట్లు రాబట్టి ఆలౌట్ ప్రమాదం నుంచి తప్పించాడు. దాంతో ఫస్టాఫ్ను పుణెరి పల్టాన్ 13–-10తో ముగించింది.