తొలిరోజు 49 నామినేషన్లు..ఉమ్మడి వరంగల్ లోని 12 మున్సిపాలిటీల్లో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ

తొలిరోజు 49 నామినేషన్లు..ఉమ్మడి వరంగల్ లోని 12 మున్సిపాలిటీల్లో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ
  • కేంద్రాలను పరిశీలించిన ఆఫీసర్లు

హనుమకొండ/ మహబూబాబాద్/ జనగామ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు తొలిరోజు బుధవారం 49 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో హనుమకొండ జిల్లా పరకాలలో 22 వార్డులకు 5 నామినేషన్లు దాఖలు కాగా, వరంగల్ జిల్లాలోని నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులకు 11 నామినేషన్లు వేశారు. 

వర్ధన్నపేటలో 12 వార్డులకు 3 నామినేషన్లు వేయగా, ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు మొత్తంగా 4 నామినేషన్లు దాఖలయ్యాయి. జనగామలో 30 వార్డులకు 8 నామినేషన్లు, 18 వార్డులున్న స్టేషన్ ఘన్ పూర్ లో కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 4 నామినేషన్లు దాఖలవగా, మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 10, 15 వార్డులున్న మరిపెడలో 2, డోర్నకల్ లో ఒక నామినేషన్లు పడ్డాయి. ఇదే జిల్లాలోని తొర్రూరు, కేసముద్రంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఆఫీసర్లు

వర్ధన్నపేట/ జనగామ అర్బన్/ నర్సంపేట/ మరిపెడ : తొలిరోజు ఆయా మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆఫీసర్లు పరిశీలించారు. వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీ కేంద్రాల్లో వరంగల్​ కలెక్టర్​ సత్యశారద పలువురు ఆఫీసర్లతో కలిసి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించగా, పరకాలలో హనుమకొండ అడిషనల్​ కలెక్టర్​ ఎన్.రవి, ​జనగామ, స్టేషన్​ఘన్​పూర్​లో అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​కుమార్​ నామినేషన్​ కేంద్రాలను సందర్శించి, పలు సూచనలు చేశారు. 

 కాగా, మహబూబాబాద్​ జిల్లా మరిపెడలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని రాష్ట్ర మున్సిపల్​ ఎన్నికల అబ్జర్వర్​ శ్యాం ప్రసాద్​లాల్​ ఆకస్మిక తనిఖీ చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులకు హెచ్చరించారు.