
హైదరాబాద్, వెలుగు: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లవుతున్నా.. ఇప్పటికీ బీసీల పథకాల కోసం 1931లో బ్రిటీష్ వాళ్లు తీసిన లెక్కలపైనే ఆధారపడుతున్నామని బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.మురళీమనోహర్ అన్నారు. ఆనాడు తీసిన లెక్కలతోనే రాజ్యాంగంలో ఓబీసీలను చేర్చారని, అప్పట్నుంచి ఇప్పటిదాకా బీసీ కుల లెక్కలను ఏ ప్రభుత్వమూ చేపట్టలేదని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన మాట్లాడారు.
ఆ ఆర్టికల్ పూర్తిగా మోసపూరితమైనది
ప్రతిసారి జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల లెక్కలు తీస్తున్న ప్రభుత్వాలు.. బీసీల లెక్కలు మాత్రం తీయడం లేదని, రాజ్యాంగంలో ఓబీసీలుగా చేర్చినప్పటికీ దానికి సరైన డెఫినిషన్ ఇవ్వలేదని మురళీమనోహర్ అన్నారు. ఆర్టికల్ 340తో రిజర్వేషన్లను ఇస్తున్నా.. ఆ ఆర్టికల్ పూర్తిగా మోసపూరితమైనదని అన్నారు. రాజ్యాంగం గుర్తించని కులాలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని చెప్పినా.. ఇస్తూనే ఉన్నారని చెప్పారు. ఆనాటి మండల్ కమిషన్ నుంచి రోహిణి కమిషన్ వరకు బీసీ లెక్కలు తీయాలని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు బడ్జెట్లో కేటాయిస్తున్నది నామమాత్రమేనని చెప్పారు. రాష్ట్ర సర్కారు 9 ఏండ్లలో రూ.14.88 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా.. బీసీలకు ఇచ్చింది 2.1 శాతమే అని, కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించింది 0.5 శాతం కన్నా తక్కువేనని ఆరోపించారు.
ఉన్నత స్థానాల్లో పెద్ద కులాల వాళ్లే ఉన్నరు
దేశంలో అసలు రాజ్యాంగమే లేదని, అది ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎట్ల ఇస్తారని టీజేఎస్ నేత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ప్రశ్నించారు. కేవలం 6% జనాభా ఉన్నోళ్లకు 10% రిజర్వేషన్లు ఎందుకిచ్చారన్నారు. వివిధ విభాగాల్లోని ఉన్నత స్థానాల్లో 70% మంది పెద్ద కులాల వాళ్లే ఉన్నారని, యూనివర్సిటీల్లో 63% వీసీలు, గవర్నర్లకు 60% సెక్రటరీలు వాళ్లే ఉన్నారని అన్నారు. ఐపీఎస్ల్లో 8%, ఐఏఎస్ల్లో 11%, సీబీఐలో 5% మందే ఓబీసీలున్నారని, ఐఐటీల్లో 4%, ఐఐఎంల్లో 2.8%, సెంట్రల్ వర్సిటీల్లో 9% మందే బీసీలున్నారని ఆయన తెలిపారు. ఇలానే కంటిన్యూ అయితే దేశంలో రాజ్యాంగమన్నది ప్రమాదంలో పడుతుందని, దీనిపై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, బీసీ కులాల లెక్కలు చేపట్టాల్సిందేనని సదస్సుకు హాజరైన వివిధ పార్టీల నేతలు, ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. సమావేశానికి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ రావాల్సి ఉన్నా పలు కారణాలతో హాజరు కాలేదు.