హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టుల కింద వానా కాలం సీజన్లో 36.81 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ సీజన్లో 91 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఈఎన్సీ(జనరల్) మురళీధర్అధ్యక్షతన నిర్వహించిన స్టేట్లెవల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్(స్కివమ్) మీటింగ్లో ఈ మేరకు నిర్ణయించారు.
ఈ సీజన్లో మొత్తం 36.81 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 23.64 లక్షల ఎకరాల్లో వరి, 13.16 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీరు ఇవ్వనున్నారు. ఎస్సారెస్పీ స్టేజీ –1 కింద 9.04 లక్షల ఎకరాలు, మిడ్మానేరు కింద 50 వేలు, కడెం కింద 53 వేలు, అలీ సాగర్ కింద 49 వేలు, గుత్ప ఎత్తిపోతల కింద 36 వేలు, నిజాంసాగర్ కింద 1.24 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రతిపాదించారు.
జూరాల కింద లక్ష, ఆర్డీఎస్కిద 55 వేలు, మూసీ కింద 30 వేలు, భీమా ఎత్తిపోతల కింద 1.47 లక్షలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షలు, కల్వకుర్తి ఎత్తిపోతల కింద 2.93 లక్షలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 3.58 లక్షలు, కాళేశ్వరం కింద 91 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు.