కేటీఆర్​కు ప్రమోషన్!.. బీఆర్ఎస్ గెలిస్తే సీఎంగా పట్టాభిషేకం

కేటీఆర్​కు ప్రమోషన్!.. బీఆర్ఎస్ గెలిస్తే సీఎంగా పట్టాభిషేకం
  • ఇక జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్
  • ప్రధాని మోదీ కామెంట్లపై గులాబీ పార్టీలో జోరుగా చర్చ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​కు త్వరలోనే ప్రమోషన్ ​దక్కనుందని ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్​ను సీఎం చేస్తానని కేసీఆర్​ తన వద్ద ప్రపోజల్​ పెట్టారంటూ ఇందూరు సభలో ప్రధాని మోదీ కామెంట్స్​చేసిన నేపథ్యంలో ‘ఇక రామన్నే సీఎం’ అనే ప్రచారం మళ్లీ జోరందుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే, కేటీఆర్ కు పట్టాభిషేకం ఖాయమని బీఆర్ఎస్​ లీడర్లు చెబుతున్నారు.ప్రధాని చెప్పిన దాని ప్రకారం రెండున్నరేండ్ల కిందనే కేటీఆర్​సీఎం కావాల్సిందని, వచ్చే ఎన్నికల తర్వాత అది జరిగి తీరుతుందని కేటీఆర్​సన్నిహితులతో పాటు ప్రగతి భవన్​తో నిత్యం టచ్​లో ఉండే లీడర్లుపేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​గెలిస్తే, కేటీఆర్​ను సీఎం చేసి కేసీఆర్ ​జాతీయ రాజకీయాలపై ఫోకస్​ చేస్తారని తెలుస్తోంది. తాను నేషనల్ ​పాలిటిక్స్​లో బిజీగా ఉండేందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చానని తన సన్నిహితులతో కేసీఆర్​ చెప్పినట్టు సమాచారం. ఈసారి అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్​ఫేస్​తోనే ఎదుర్కొన్నప్పటికీ, కేటీఆర్​కు పట్టం కట్టడం ఖాయమనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలకు ప్రధాని కామెంట్స్​ మరింత ఊతమిచ్చాయని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

2019 నుంచే డిమాండ్..

కేటీఆర్​ను సీఎం చేయాలని కుటుంబసభ్యులతో పాటు ఆయన సన్నిహితులు కోరుతున్నారని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. ఇప్పుడది నెరవేరే టైమ్ వచ్చిందని అంటున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేటీఆర్​కు వర్కింగ్​ప్రెసిడెంట్​పదవి ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడికి ఉన్న అధికారాలన్నీ కట్టబెట్టారు. 2019లో కేటీఆర్​ను సీఎం చేయాలనే డిమాండ్​పై పార్టీలో డిఫరెంట్​టాక్​ఉన్నప్పటికీ, రెండేండ్లు తిరిగే సరికి కేటీఆర్​నాయకత్వంలో పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీనియర్​లీడర్లు ప్రకటించారు. దీంతో కేటీఆర్​కు పట్టాభిషేకం ఖాయమని అప్పట్లోనే ప్రచారం సాగింది. కేటీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారంటూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కామెంట్లు చేశారు. ఒకానొక దశలో ఈ కామెంట్లపై కేసీఆర్ ​సీరియస్ అయ్యారు. కేటీఆర్ ​సీఎం అయితే తానేం చేయాలని పార్టీ లీడర్లను ప్రశ్నించారు. అలాంటి కామెంట్స్​చేస్తే కాళ్లు పట్టి బండకేసి కొడ్తానని హెచ్చరించారు. కానీ అదే సమయంలో కేటీఆర్​ను సీఎం చేస్తానని, తమ పార్టీ ఎన్డీయేలో చేరేందుకు అనుమతించాలని ప్రధానిని కేసీఆర్ కోరినట్టుగా మోదీ కామెంట్లను బట్టి తెలుస్తోంది.