మలిదశ ఉద్యమ తొలిపొద్దు గూడ అంజయ్య

మలిదశ  ఉద్యమ తొలిపొద్దు గూడ అంజయ్య

తెలంగాణ తొలిదశ పోరాటం నుంచి మలిదశ పోరాటం వరకూ తన కలంతో, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిల్చిన ప్రజాకవి గూడ అంజయ్య. కాలం వెంట చాలా మంది కవులు పరిగెత్తుతారు. కానీ కాలాన్ని తన వెనకాల నిలబెట్టుకొని ఆనాటి సమాజంలో తన పాటలతో, రచనలతో, కవితలతో, గానంతో సమాజాన్ని కదిలించి దోపిడీని ప్రశ్నించిన ఉద్యమ కవి ఆయన. అంజన్న చూసిన బతుకులు.. ఆయన బతికిన బతుకు.. ఇవే ఆయన పాటలకు ప్రేరణలు. పాట వల్ల సమాజం మారిపోతుందా... అంటే ఒక పాట ప్రభావం ప్రజలపై తప్పకుండా ఉంటుందని అంటాడు. పాట ఒక ప్రశ్నకు సమాధానం కాకపోవచ్చు, కానీ జవాబు రాబట్టే మార్గాన్ని నిర్దేశిస్తుందని ఆయన నమ్మకం. సామాన్యుల బతుకులు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయో జీవితానుభవం ద్వారా తెలుసుకొని ప్రజలను జాగృతం చేసే దిశగా ఆయన రచనలు కొనసాగించాడు. దొరల, భూస్వాముల దోపిడీని ప్రశ్నిస్తూ అన్ని పనులు మనమే చేస్తే మధ్యలో దొరల పెత్తనమేందంటూ ప్రశ్నించాడు. జనంలోంచి వచ్చిన జానపదమే తన ప్రాణప్రదమని నమ్మి తన కలంలో పేదల కన్నీళ్లను సిరాగా పోసి మలిదశ ఉద్యమానికి కొత్త ఊపిరి పోశారు. తెలంగాణ  పోరాటం పతాక దశకు చేరడానికి కారణమయ్యాడు.

అంజన్న   నేపథ్యం..

ఆనాటి దొరల గడీలకు దూరంగా బానిసత్వంలో బతికీడుస్తున్న  ప్రజల కష్టాన్ని చూసి, అనుభవించి,  కన్నీరు పెట్టుకొని,  చలించిపోయి రాసిన పాటలను గుండెల్లో నింపుకొని పాడిన గూడ అంజయ్య పూర్వపు అదిలాబాద్ జిల్లా (ప్రస్తుత మంచిర్యాల జిల్లా) దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామం.  లక్ష్మయ్య, లక్ష్మమ్మ అనే పుణ్య దంపతులకు 1955 నవంబర్ 1న జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాలు లింగాపూర్, లక్సేట్టిపల్లిలో పూర్తి చేశారు.1970లో హైదరాబాద్ వచ్చి ఇంటర్, బీఫార్మసీని  పూర్తిచేసి ఫార్మసిస్టుగా ఉట్నూరులో ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఇంటర్ చదివే సమయంలో నక్సల్బరి ఉద్యమం మొదలైంది. సమాజంలోని దురాచారాలు దోపిడీపై పోరాటం ప్రారంభమైంది. ఆ భావజాలానికి ఆకర్షితుడై అరుణోదయ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుల్లో ఒక్కడయ్యాడు. ఒకపక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దుస్థితిని చూస్తూ.. ఇంకోపక్క బాల్యంలో ఎదురైన సంఘటనలు  ఆయనలో ఒక రకమైన ఆవేశాన్ని రగిలించాయి. ప్రజల్ని చైతన్య పరచాలని బలమైన కోరికను కలిగించాయి. దానికి సరైన మాధ్యమం పాటే అని నిర్ణయించుకున్నాడు. ఇదే సందర్భంలో ఒకసారి హైదరాబాద్ నుంచి లింగాపూర్ ఊరు వెళ్ళాడు. బస్సు దిగి ఊరు వైపు నడుస్తున్న ఆయనకు ఊరిలోకి  నడుచుకుంటూ వెళుతున్న ఒక ముసలాయన కనిపించాడు. అతనిని పలకరించగా చిరాగ్గా చూశాడు. ఏమైందని అడిగితే ఏం చెప్పమంటావు బిడ్డ ఎప్పుడో ఆరేండ్ల కిందట దొర దగ్గర అప్పు తీసుకున్నాను. అప్పటి నుంచి వెట్టి చాకిరి చేస్తూనే ఉన్నాను. ఇంకా అసలు కూడా ముట్టలేదు అని అంటున్నాడు. ‘ఊరదలిపోవాల్నో ఊరిలోనే చావాల్నో’ అంటూ ఏడ్చాడు. రైతు కన్నీళ్లు చూసి చలించిపోయిన అంజయ్య ఊరిడిసి నేపోదున/ అయ్యో ఉరి పెట్టుకుని సత్తునా అని రైతు మాటలను పాటగా రాశాడు.ఇది ఆయన మొదటి పాట. ఆనాడు మొదలైన పాటల ప్రవాహం  తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేంతవరకు కొనసాగింది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో అంజయ్య పాటలు ప్రతి పల్లెను కదిలించాయి. ప్రతి హృదయాన్ని తడిపాయి. ఉద్యమానికి రమ్మని చేయి పట్టుకుని నడిపించాయి. ఉత్తేజాన్ని తీసుకువచ్చాయి. అణువణువునా తెలంగాణ ఆకాంక్షను రేకెత్తించాయి. 2002లో కామారెడ్డిలో జరిగిన ధూం ధాం మొదటి బహిరంగ సభలో  ‘అయ్యోనివా  నీవు అవ్వోనీవా’ అంటూ పాడిన పాట ఆంధ్ర పెత్తనం దోపిడీ వ్యవస్థ మీద నిగ్గదీసి అడుగుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ఉచ్చదశకు చేర్చింది.
అమ్మ పేగు భాషను ఆర్తితో పలికిస్తూనే బడుగు జీవుల శ్రమను దోచుకోవడానికి పల్లెకు పట్టణానికి తేడా ఉండదని హెచ్చరించాడు. ఈ పాట ‘రంగుల కల’ సినిమా ద్వారా చాలా ప్రాముఖ్యత పొందింది. తెలంగాణ నుడికారం, ధిక్కారం, కలల సాకారం కలగలిసిన పాటకు ఏ గండ పెండేరం ఎవరు తొడగకుండానే పుట్టెడు కష్టాలు, చుట్టుముట్టి అనారోగ్యం మధ్య 2016 జూన్ 21న స్వర్గస్తులయ్యారు.

‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా..’

తొలిపాట దగ్గర నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమ గీతాల వరకూ జనాలకు అత్యంత ప్రేరణను ఇచ్చిన పాట ‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా’ తెలంగాణ రాష్ట్ర పొలిమేర దాటి 16 భాషల్లోకి అనువదించబడి అడవి మైదానం నుంచి అంతర్జాతీయ వేదికల మీద కవులు, కళాకారులు, ప్రజల్ని ఉర్రూతలూగించిన పాట ఇది. ఆయన పాటల్లో కుటుంబ కష్టాలు, కడు పేదరికం, మధ్యతరగతి  బలహీనతలు, బాధలు ఉంటాయి.
అసలేటి వానల్లో.. ముసలెడ్లు గట్టుకొని
మోకాలి బురదలో..మడిగట్టు దున్నితే
గరిసెలెవరివి నిండెరా- గంగన్న..
గుమ్ములెవరివి నిండెరా-గంగన్న
అంటూ రైతన్న గోసను ఎత్తిచూపుతూ తిరుగుబాటు కాంక్షను రగిలిస్తూ పీడిత,తాడిత ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయి..
భద్రం కొడుకా  పైలం కొడుకా..
రిక్షా ఎక్కే కాడ దిగే కాడ..
తొక్కుడు కాడ మలుపుడు కాడ.. 
భద్రం కొడుకో  జర పైలం కొడుకో.. 

- అంకం నరేష్  సోషల్​ ఎనలిస్ట్