- వైరా ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు
కారేపల్లి, వెలుగు: ఓట్లేసి గెలిపిస్తే ఊరికి చేసిందేంటని, రెండున్నర సంవత్సరాల్లో గ్రామంలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములునాయక్ను వెంకట్యతండా గ్రామస్తులు నిలదీశారు. కారేపల్లి మండల పరిధిలోని వెంకట్యతండా గ్రామంలో తీజ్ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆదివారం యువకులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత మళ్లీ ఇప్పుడు ఊర్లోకి వచ్చారని అన్నారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు ఏంటో చెప్పాలని ఫైర్ అయ్యారు. సీఐ శ్రీనివాసులు, పోలీసులు గ్రామ యువకులను సముదాయించారు. గ్రామస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యలకు సంబంధించి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి కార్యక్రమాన్ని ముగించుకుని వెనుతిరిగారు.