

ఢిల్లీ : ఉగ్రవాదుల అడ్డా పాకిస్థాన్ ను ప్రపంచంలో ఏకాకిని చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి మద్దతు లభించింది. పుల్వామాలో 40 మంది సీఆర్పీపీఎఫ్ జవాన్ల ప్రాణం తీసిన కిరాతక ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను ఇప్పటికే భారత్ టార్గెట్ చేసింది. అతడు ఇండియాకే కాదు.. ప్రపంచానికి భయంకరమైన శత్రువు అని కేంద్రం ప్రకటించింది. ఢిల్లీ చేసిన ప్రకటనకు అమెరికా మద్దతు పలికింది.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్డన్… భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను ఫోన్ లైన్ లో సంప్రదించారు. జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. సరిహద్దు ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు భారత్ కు ఉన్న ఆత్మరక్షణ హక్కును ఆయన బలపరిచారు.
జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా పాకిస్థాన్ ప్రకటించాలన్న భారత్ వాదనకు అమెరికా సపోర్ట్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి చేసిన 1267తీర్మానం ప్రకారం… జైష్ ఎ మహమ్మద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించకుండా ఉండేందుకు ఉన్న అభ్యంతరాలకు జవాబు చెప్పాలని పాకిస్థాన్ ను.. భారత్, అమెరికా డిమాండ్ చేశాయి.
అమెరికా, ఇండియా లాంటి దేశాలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని అజిత్ దోవల్, జాన్ బోల్టన్ ఉమ్మడిగా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులకు స్వర్గంలా మారిన దేశం పాకిస్థాన్ నుంచి టెర్రరిజాన్ని పూర్తిగా అణచివేసేంతవరకు ఇండియా-అమెరికా కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
