భారీ వర్షాలకు పుణె ఆగమాగం.. ముంబై-పుణె మధ్య తెగిపోయిన సంబంధాలు.. అన్నీ బంద్

భారీ వర్షాలకు పుణె ఆగమాగం.. ముంబై-పుణె మధ్య తెగిపోయిన సంబంధాలు.. అన్నీ బంద్

పుణె: రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై-పుణె కనెక్టివిటీ పూర్తిగా స్తంభించిపోయింది. కుండపోత వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా రైలు సర్వీసులు నిలిచిపోవడంతో పాటు, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, పాత హైవే రెండింటినీ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది.

దీంతో.. ప్రయాణికులు భారీ వర్షాల్లో చిక్కుకుపోయి.. ముంబై, పుణె నగరాల మధ్య ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాల కారణంగా.. కనీసం 16 రైళ్లను రద్దు చేశారు. మరో తొమ్మిది రైళ్లను దారి మళ్లించారు. ఈ క్రమంలో.. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ముంబైకి ఆరెంజ్ అలర్ట్, పుణెకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

కర్జత్, లోనావాలా మధ్య ఆగ్నేయ ఘాట్ విభాగంలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా, ముంబై డివిజన్ అప్ మెయిన్ లైన్‌లోని ఠాకుర్‌వాడి, మంకీ హిల్ లూప్ క్యాబిన్ మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. ముంబై, పుణె మధ్య ఎక్స్‌ప్రెస్‌వే, హైవేను మూసివేశారు.

ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలోని రెండు క్యారేజ్‌వేలతో పాటు పాత ముంబై-పుణె హైవేపై కూడా ట్రాఫిక్‌ను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. టన్నెల్ 2 ఎగ్జిట్ దగ్గర కొండచరియలు విరిగిపడటంతో, ఖోపోలి-కుస్‌గావ్ మిస్సింగ్ లింక్‌లోని పూణే వైపు వెళ్లే క్యారేజ్‌వేపై సోమవారం తెల్లవారుజామున ట్రాఫిక్‌ను మళ్లించారు. వరదలు, పొంగిపొర్లుతున్న నీటి కారణంగా పాత హైవేలో కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ముంబైలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల 24 గంటల్లో దాదాపు 300 ఎంఎం వర్షపాతం నమోదైంది. గంటకు 42 నాట్ల వేగంతో బలమైన గాలులు వీచాయి.

వాతావరణం అనుకూలించకపోవడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్​పోర్టులో రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే కార్యకలాపాలను గంటపాటు పూర్తిగా నిలిపివేశారు. పెను గాలులకు కుర్లాలో ఓ చెట్టు నేలకూలి ఓ వృద్ధుడు మరణించాడు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ముంబైలోని స్కూళ్లు, కాలేజీలకు బీఎంసీ సెలవు ప్రకటించింది.

►ALSO READ | హార్మూజ్ నుంచి వెళ్లే నౌకలకు సర్వీస్ ఫీజు.. మిత్రదేశాలకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తామన్న ఇరాన్