కేసీఆర్, కేజ్రీవాల్లతోనే దేశంలో రైతురాజ్యం : పంజాబ్ స్పీకర్

కేసీఆర్, కేజ్రీవాల్లతోనే దేశంలో రైతురాజ్యం :  పంజాబ్ స్పీకర్

నిజామాబాద్ :  కేసీఆర్, కేజ్రీవాల్లతోనే దేశంలో రైతురాజ్యం సాధ్యమవుతుందని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత కుల్తార్ సింగ్ సంధ్వాన్ అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాల వల్ల ఎంతోమంది పేదలకు మేలు జరుగుతోందని చెప్పారు. ‘‘రైతు బంధు పథకం వల్ల తెలంగాణలోని రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. రైతుకు మంచి చేస్తేనే దేశానికి మంచి జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. రైతులు, పేదల కోసం సంక్షేమ  పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ కు అందరూ మద్దతివ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పంజాబ్ శాసన సభ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ మాట్లాడారు.

టీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం,  నిజామాబాద్ బాగా అభివృద్ధి చెందాయన్నారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ పథకాలను పేదల కోసం అమలు చేస్తోందని తెలిపారు. పంజాబ్ లో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ జై కిషన్ సింగ్ రౌరీ, ఎంపీ విక్రమ్ జిత్ సింగ్ సహానీ, ఎమ్మెల్యేలు కుల్వంత్ సింగ్ పండోరి, అమర్ జీత్ సింగ్, నిజామాబాద్  అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు.