
జైపూర్: ఐపీఎల్లో 2014 తర్వాత పంజాబ్ కింగ్స్ తొలిసారి ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. నేహల్ వాధెరా (37 బాల్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 70), శశాంక్ సింగ్ (30 బాల్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 నాటౌట్) మెరుపు ఫిఫ్టీలకు తోడు స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ (3/22) మ్యాజిక్ చేయడంతో ఎనిమిదో విజయంతో ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో 10 రన్స్ తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. తొలుత పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 219/5 స్కోరు చేసింది.
ఛేజింగ్లో రాయల్స్ ఓవర్లన్నీ ఆడి 209/7 స్కోరు మాత్రమే చేసి పదో ఓటమి ఖాతాలో వేసుకుంది. ధ్రువ్ జురెల్ (31 బాల్స్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 53), యశస్వి జైస్వాల్ (25 బాల్స్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 50)తో పాటు 14 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ (15 బాల్స్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 40) మెరిసినా ఫలితం లేకపోయింది. హర్ప్రీత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
వాధెరా, శశాంక్ ధనాధన్
టాపార్డర్ ఫెయిలైన వేళ నెహాల్ వాధెరా.. చివర్లో శశాంక్ ఆదుకోవడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ టీమ్కు ఆరంభంలోనే వరుస షాక్లు తగిలాయి. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (9)ను రెండో ఓవర్లో తుషార్ దేశ్పాండే (2/37) ఔట్ చేసి రాయల్స్కు బ్రేక్ ఇచ్చాడు. వన్డౌన్లో వచ్చిన అరంగేట్రం బ్యాటర్ మిచెల్ ఓవెన్ (0) తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బాల్స్ ఆడి మఫాకా బౌలింగ్లో డకౌటయ్యాడు. అప్పటికే మూడు ఫోర్లు, ఓ సిక్స్తో జోరు మీద కనిపించిన మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ (21) తర్వాతి బాల్కే దేశ్పాండే బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇవ్వడంతో పంజాబ్ 34/3తో ఇబ్బందుల్లో పడింది.
ఈ టైమ్లో వాధెరా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ధాటిగా ఆడిన ఈ ఇద్దరూ క్రమం తప్పకుండా ఫోర్లు, సిక్సర్లు కొట్టారు. ముఖ్యంగా వాధెరా భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. రియాన్ పరాగ్ వేసిన 11వ ఓవర్లో ఫోర్ కొట్టిన అయ్యర్ స్కోరు వంద దాటించాడు. కానీ, తర్వాతి బాల్కే జైస్వాల్కు క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్కు 67 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న వాధెరా జోరు కొనసాగించాడు.
హసరంగ బౌలింగ్లో సిక్స్ కొట్టిన అతనికి 48 రన్స్ వద్ద క్యాచ్ డ్రాప్తో లైఫ్ వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పంజాబ్ బ్యాటర్.. మధ్వాల్ ఓవర్లో 4, 6 కొట్టి 25 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో శశాంక్ కూడా జోరు చూపెట్టాడు. మధ్వాల్ తర్వాతి ఓవర్లో వరుసగా రెండో సిక్స్ కొట్టే ప్రయత్నంలో హెట్మయర్కు క్యాచ్ ఇచ్చి వాధెరా ఔటైనా శశాంక్ వెనక్కు తగ్గలేదు. స్లాగ్ ఓవర్లలో రాజస్తాన్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
చివర్లో అజ్మతుల్లా ఓమర్జాయ్ (9 బాల్స్లో 21 నాటౌట్) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫరూఖీ వేసిన 17వ ఓవర్లో శశాంక్ రెండు ఫోర్లు, సిక్స్ కొడితే.. మఫాకా బౌలింగ్లో అజ్మతుల్లా 4, 6, 4తో ఆకట్టుకున్నాడు. దేశ్పాండే వేసిన చివరి ఓవర్లో శశాంక్ 6, 4తో స్కోరు 210 దాటించాడు. కాగా, చేతి వేలికి గాయం కారణంగా పంజాబ్ కెప్టెన్ అయ్యర్ ఫీల్డింగ్కు దూరంగా ఉండగా.. శశాంక్ స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరించాడు.
కుర్రాళ్లు మెరిసినా..
భారీ టార్గెట్ ఛేజింగ్లో రాజస్తాన్కు అద్భుత ఆరంభం లభించినా.. మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు చేజేతులా ఓడింది. స్టార్టింగ్లో యంగ్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపారు. అర్ష్దీప్ వేసిన తొలి ఓవర్లోనే జైస్వాల్ 4, 0, 4, 4, 6, 4తో ఏకంగా 22 రన్స్ రాబట్టాడు. రెండో ఓవర్లో యాన్సెన్కు సూర్యవంశీ 6, 4, 6తో స్వాగతం పలికాడు. బార్ట్లెట్ బౌలింగ్లో జైస్వాల్ మూడు ఫోర్లు కొట్టడంతో మూడో ఓవర్లోనే స్కోరు ఫిఫ్టీ దాటింది.
అర్ష్దీప్ బౌలింగ్లో ఫోర్, రెండు భారీ సిక్సర్లు కొట్టిన సూర్యవంశీ.. స్పిన్నర్ హర్ప్రీత్ ఓవర్లో 4, 4 బాదాడు. కానీ, తర్వాతి బాల్కే బార్ట్లెట్కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్కు 76 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. యాన్సెన్ బౌలింగ్లో జైస్వాల్ రెండు ఫోర్లు బాదడంతో పవర్ప్లేను 89/1తో ముగించిన రాజస్తాన్ ఈజీగా గెలిచేలా కనిపించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత పంజాబ్ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ బ్రార్ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.
ఏడో ఓవర్లో ఐదు రన్స్ మాత్రమే ఇచ్చిన అతను తన తర్వాతి ఓవర్లో జైస్వాల్ను పెవిలియన్ చేర్చి రాయల్స్ జోరుకు బ్రేక్ వేశాడు. మరో స్పిన్నర్ చహల్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయగా.. అజ్మతుల్లా వేసిన 11వ ఓవర్లో కెప్టెన్ శాంసన్ (20) పెవిలియన్ చేరడంతో రాజస్తాన్ డీలా పడ్డది. ఈ దశలో ధ్రువ్ జురెల్ భారీ షాట్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా మరో ఎండ్లో అతనికి సపోర్ట్ కరువైంది. బ్రార్ బౌలింగ్లో రియాన్ పరాగ్ (13) బౌల్డ్ అవ్వగా.. క్రీజులో ఇబ్బంది పడిన హిట్టర్ షిమ్రన్ హెట్మయర్ (11)ను అజ్మతుల్లా పెవిలియన్ చేర్చాడు.
ఇంకో ఎండ్లో ఒంటరి పోరాటం చేసిన జురెల్.. అజ్ముతుల్లా ఓవర్లో సిక్స్ కొట్టి జట్టును రేసులో నిలిపాడు. చివరి రెండు ఓవర్లలో ఆ టీమ్కు 30 రన్స్ అవసరం అయ్యాయి. అర్ష్దీప్ వేసిన 19వ ఓవర్లో జురెల్ ఫోర్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకోగా 8 రన్స్ మాత్రమే వచ్చాయి. చివరి ఓవర్లో ఆ టీమ్ విజయానికి 22 రన్స్ అవసరం అయ్యాయి. జురెల్, హసరంగ (0)ను వరుస బాల్స్లో ఔట్ చేసిన 11 రన్స్ మాత్రమే ఇవ్వడంతో పంజాబ్నే విజయం వరించింది.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్ కింగ్స్: 20 ఓవర్లలో 219/5 (వాధెరా 70, శశాంక్ 59 నాటౌట్, తుషార్ దేశ్పాండే 2/37)
రాజస్తాన్: 20 ఓవర్లలో 209/7 (జురెల్ 53, యశస్వి 50, హర్ప్రీత్ బ్రార్ 3/22).