జడ్పీ మీటింగ్​లంటే చులకన.. ఒక్క మీటింగ్​కు కూడా రాని పువ్వాడ, పల్లా

జడ్పీ మీటింగ్​లంటే  చులకన.. ఒక్క మీటింగ్​కు కూడా రాని పువ్వాడ, పల్లా
  • ఎమ్మెల్యేలు, ఎంపీలూ హాజరు కావట్లే
  • జిల్లా స్థాయి ఆఫీసర్లదీ అదేతీరు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రజాసమస్యలను చర్చించి పరిష్కరించేందుకు వేదిక అయిన జిల్లాపరిషత్​ మీటింగ్​లకు మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొడుతున్నారు. ఈ సమావేశాల్లో గ్రామ, మండలస్థాయి సమస్యలను లోతుగా చర్చించేందుకు అవకాశం ఉంటుంది. ఇటు ప్రభుత్వ పెద్దలు.. అటు జిల్లా ఉన్నతాధికారులు ఉంటారు కాబట్టి అక్కడిక్కడే అధికారులకు దిశానిర్దేశం చేసి సమస్యలు పరిష్కరించే వీలుంటుంది. అయినా కీలకమైన ఈ సమావేశాలపట్ల లీడర్లు, ఆఫీసర్లు పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారని జడ్పీటీసీలు, మండల పరిషత్​ ప్రెసిడెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

డిసెంబర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లెక్కన మంగళవారం జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్​మీటింగే ప్రస్తుత ఎమ్మెల్యేలకు చివరిది. ఈ మీటింగ్​కు అందరూ వస్తారని ఆశించిన మండల ప్రజాప్రతినిధులకు ఈసారీ నిరాశే ఎదురైంది. 

మంత్రి ఒక్కసారీ రాలే

 ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జడ్పీ మీటింగ్​లకు ముఖ్యనేతలే ముఖం చాటేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఒక్క మీటింగ్ కు కూడా అటెండ్​ కాలేదు. ఖమ్మంలో ఏ చిన్న ప్రోగ్రాం అయినా మంత్రి పువ్వాడ అటెండ్​ అవుతుంటారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాగా ఏర్పడిన తర్వాత మొత్తం 18 మీటింగ్​లు జరగ్గా ఆయన ఒక్కటంటే ఒక్క మీటింగ్​కు కూడా రాలేదు. పల్లా కూడా ఒక్కసారీ సమావేశంలో పాల్గొనలేదు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు సగం మీటింగ్​లకు డుమ్మా కొట్టారు. 

ఆయన 9సార్లు మాత్రమే అటెండ్​ అయ్యారు. మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక్కసారి మాత్రమే వచ్చారు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియ ఐదు సార్లు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య , అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మూడేసి సార్లు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ ఒక్కసారి, ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి నాలుగు సార్లు అటెండ్​ అయ్యారు. తాతా మధు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆరు సార్లు మీటింగ్​లు జరిగితే రెండు సార్లు మాత్రమే అటెండ్​ అయ్యారు. మంగళవారం జరిగిన మీటింగ్​కు మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు దూరంగా ఉండగా ఒక్క తాతా మధు మాత్రమే వచ్చారు.

ఆఫీసర్లదీ అదే తీరు

జడ్పీ మీటింగ్​ల పట్ల జిల్లా ఆఫీసర్లు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల హెడ్​లు రాకుండా తమ కింది అధికారులను పంపుతున్నారు. శాఖపరంగా పూర్తి అవగాహన లేక పోవడంవల్ల వారు మొక్కుబడిగా హాజరవుతున్నారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమే ఎక్కువ. అయినా ఐటీడీఏ పీఓ కూడా జడ్పీ మీటింగ్​లను లైట్​ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 

మంగళవారం జరిగిన జనరల్​ బాడీ మీటింగ్​ఎజెండాలో ఐటీడీఏ, ఫారెస్ట్​ అంశాలుండగా ఆయా డిపార్ట్​మెంట్ల ఆఫీసర్​ఒక్కరూ రాకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్​కు మంత్రి ఇతర ముఖ్య నేతలు వస్తే ప్రధాన సమస్యలు కొంతవరకైనా పరిష్కారం అవుతాయని, వారు రాకపోవడంవల్ల జిల్లాకు అన్యాయం జరుగుతోందని జడ్పీటీసీలు, ఎంపీపీలు వాపోయారు.