- మాంద్యం వచ్చినా నిలదొక్కుకోగలిగాం: మంత్రి పొన్నం
- నెక్లెస్ రోడ్ జ్ఞాన భూమిలో నివాళి అర్పించిన కిషన్రెడ్డి, రాంచందర్రావు
హైదరాబాద్సిటీ/న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని, మాట్లాడారు.ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన బహుభాషా కోవిదుడిగా పీవీని కొనియాడారు. మన దేశం ఆర్థిక అంశాల్లో ఈరోజు నిలబడి ఉందంటే పీవీ సంస్కరణలే కారణమన్నారు.
తెలంగాణ ముద్దు బిడ్డ అయిన పీవీ చూపిన మార్గం వల్లే ప్రపంచ మాంద్యం, కరోనా వంటి విపత్తులు వచ్చినా దేశం తట్టుకుని నిలబడిందని చెప్పారు. బీజేపీ నేతలు కూడా అక్కడే పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హిమాచల్ప్రదేశ్మాజీ గవర్నర్బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రధానిగా పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. నేటి తరం రాజకీయ నాయకులాంతా పీవీని ఆదర్శంగా తీసుకుని పని చేయాలని కోరారు.
దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి పీవీ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశానికి ఆర్థిక సంస్కరణలు రూపొందించిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు గుర్తుచేశారు. తెలంగాణ సమాజం పీవీని ఆదర్శంగా తీసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు.
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ: గౌరవ్ ఉప్పల్
ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పీవీ నరసింహారావు అని ఢిల్లీలో తెలంగాణ సెక్రటరీ కోఆర్డినేషన్ గౌరవ్ ఉప్పల్ స్మరించుకున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం పీవీ నరసింహారావు వర్థంతిని మంగళవారం నిర్వహించింది. పీవీ ఫొటో వద్ద గౌరవ్ ఉప్పల్ నివాళులర్పించారు. భారత ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంస్కరణశీలిగా, బహుభాషా కోవిదుడిగా భారతరత్న పీవీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
