ఏడాది పొడువునా పీవీ నరసింహారావు శతజయంతి వేడుక‌లు

ఏడాది పొడువునా పీవీ నరసింహారావు శతజయంతి వేడుక‌లు

హైద‌రాబాద్:  ఈనెల 28న జరుగనున్న పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా సంవత్సం పొడుగునా అయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఈ విష‌యంపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం రాజ్యసభ పక్ష నేత కేశవరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సమావేశమైంది. ఈ మీటింగ్ కు కేటీఆర్, ఈట‌ల‌, శ్రీనివాస్ గౌడ్ లు హాజరయ్యారు. పీవీ నరసింహారావు కుటుంబసభ్యులు కూడా హాజరైన ఈ సమావేశంలో పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వచ్చే సంవత్సరం పివి జయంతి వరకు కనీసం పది, పన్నెండు ఘనమైన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా కమిటీ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి ఒక జాతీయ సెమినార్ మెదలుకుని.. పీవీ స్మారక కేంద్రం ఏర్పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా కమిటీ నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కమిటీ.. భవిష్యత్తులో పీవీ గారితో అనుబంధం ఉన్న మరింత మందితో విస్తరిస్తామన్నారు.

ప్రస్తుతం దేశం ఇంతమంచి పరిస్థితుల్లో ఉన్నదంటే, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే పి.వి.నరసింహారావు కాలంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఆయన నాయకత్వంలో విజయవంతంగా అధిగమించడమే కారణమన్నారు కేశ‌వ‌రావు. కేవలం పరిపాలనాలో మాత్రమే కాకుండా భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర గణనీయమైనదన్నారు. అనేక అంశాల్లో పీవీ పాత్ర ప్రస్తుత తరానికి అర్థమయ్యేలా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కేశ‌వ‌రావు. హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ఈనెల 28వ తేదీన శతజయంతి ఉత్సవాల నుంచి.. వచ్చే ఏడాది జరగనున్న జయంతి నాటికి వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించిందన్నారు.

రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఉన్న మెమోరియల్ మాదిరే ..పీవీకి ఒక మెమోరియల్ ఉండాలన్న ఆలోచన తమకు ఉన్నదని కేకే అన్నారు. దీంతోపాటు వంగరలోనూ వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాటు పార్లమెంట్ లో పీవీ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కూడా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం చర్చించిన అంశాల పైన సీఎం కేసీఆర్ తో చర్చించి, తుది కార్యక్రమాలను ఆయన ప్రకటిస్తారని తెలిపారు కేకే.