
KiranaPro News: ప్రస్తుతం దేశంలో ఆన్ లైన్ కిరాణా సరుకులను విక్రయించే యాప్స్ పెరిగాయి. క్విక్ కామర్స్ వ్యాపారం ఊపందుకోవటంతో క్షణాల్లో ఇంటికే వస్తువుల డెలివరీ పెరిగింది. ఈ క్రమంలో చాలా మంది వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం అలాంటి ఒక యాప్ హ్యాకర్ల దాడికి గురికావటం ఆందోళనలు రేకెత్తిస్తోంది. వ్యక్తుల బ్యాంకింగ్, పర్సనల్ డేటా లీక్ కావటం ప్రమాదకరంగా మారింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కిరాణాప్రో యాప్ గురించే. వాస్తవానికి ఇది కొన్ని నెలల కిందట డిసెంబర్ 2024లో ప్రారంభించబడింది. ప్రధానంగా ప్రజలు వాయిస్ కమాండ్స్ ద్వారా తమ స్థానిక భాషల్లో అవసరమైన వస్తువులను ఆర్డర్ చేసేందుకు ఇది వీలు కల్పించింది. ప్రస్తుతం హిందీ, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ వంటి భాషల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. పైగా ఈ సంస్థలో ప్రఖ్యాత క్రీడాకారిణి పీవీ సింధు కూడా పెట్టుబడులను కలిగి ఉన్నారు. ఈ కంపెనీపై తాజాగా జరిగిన సైబర్ దాడిలో కస్టమర్లకు సంబంధించిన విలువైన సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించటం చర్చనీయాంశంగా మారింది.
సైబర్ అటాక్ తర్వాత కిరాణాప్రో యాప్ అస్సలు వినియోగించటానికి వీలులేకుండా పోయిందని వ్యవస్థాపకుడు దీపక్ రవీంధ్రన్ వెల్లడించారు. హ్యాకర్లు తమ సర్వర్లలోని మెుత్తం డేటాను డిలీట్ చేశారన్నారు. యాప్ కోడింగ్ నుంచి కస్టమర్లకు సంబంధించిన వివరాలు పేమెంట్ సమాచారం వరకు అన్నింటినీ కంపెనీ కోల్పోయిందని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 నగరాల్లో సేవలు అందిస్తున్న సంస్థ విస్తరణ బాటలో ఉన్న సమయంలో ఇది జరిగింది.
హ్యాకర్లు కంపెనీకి చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్, గిట్ హబ్ ఖాతాలకు యాక్సెస్ పొందినట్లు గుర్తించారు. అయితే ఇది కంపెనీని వీడిన ఉద్యోగుల క్రెడెన్షియల్స్ ద్వారా జరిగి ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. తాము రక్షణ కోసం టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ ప్రక్రియను వినియోగిస్తున్నప్పటికీ ఇది ఎలా జరిగిందో కనిపెట్టలేకపోతున్నారు. అయితే కంపెనీని వీడిన ఉద్యోగులు తమ క్రెడెన్షియల్స్ తిరిగి ఇవ్వకపోవటం వల్ల అవి దుర్వినియోగం అయ్యాయనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. మెుత్తానికి కంపెనీ పెద్ద దెబ్బను ఎదుర్కొందని, తమ వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా ప్రభావితం అయ్యాయని యాజమాన్యం చెబుతోంది.