రిలయన్స్, టీసీఎస్ను మించి ఉద్యోగాలు ఇచ్చింది
క్వెస్ కంపెనీ క్లయింట్లు 2,500 కంపెనీలు
బెంగళూరు: క్వెస్ కార్ప్.. ఈ పేరు పెద్దగా ఎవరూ విని ఉండకపోవచ్చు. కానీ దేశంలో అత్యంత ఎక్కువ మందిఉద్యోగులున్న ప్రైవేటు సంస్థ ఇదే. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీలో ఉద్యోగులు, అసోసియేట్స్ మొత్తంగా కలిపి 3.85 లక్షల మంది ఉన్నారు. ప్రైవేట్ రంగంలోని మరే ఇతర కంపెనీలోనూ ఇంత మంది ఉద్యోగులు లేకపోవడం విశేషం. 2016 నుంచి ఈ సంస్థ ఏటా 38 శాతం వృద్ధి సాధిస్తోంది. ఉద్యోగాలు కల్పించడంలో టెక్ దిగ్గజం టీసీఎస్ను సైతం ఈ సంస్థ దాటేసింది. టీసీఎస్ ఇండియాలో 3.6 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తోంది. అదే విదేశీ ఉద్యోగులు 90 వేల మందిని కూడా తీసుకుంటే, ఈ సంస్థలో 4.46 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆసియాలోనే అత్యంత ధనికుడైన అంబానీ నాయకత్వంలోని రిలయన్స్, టాటాల కంపెనీ టీసీఎస్ కంటే ఎక్కువ మందికి క్వెస్ కార్ప్, మన దేశంలో ఉద్యోగాలను కల్పిస్తోంది.
క్లయింట్స్లో శాంసంగ్, అమెజాన్, రిలయన్స్ లాంటి సంస్థలు…
ఈకామర్స్ డెలివరీ నుంచి కమర్షియల్ బిల్డింగ్స్ మేనేజ్మెంట్ వరకూ.. అవుట్సోర్సింగ్ వర్కర్లకు ఎక్కువగా డిమాండ్ ఉండటంతో.. క్వెస్ కార్ప్ ఎక్కువగా లాభపడుతోంది. క్వెస్ కార్ప్ రెండున్నర వేల మందికి పైగా క్లయింట్స్కు అవుట్సోర్సింగ్ సర్వీసు ప్రొవైడర్గా ఉంది. ఈ క్లయింట్స్లో శాంసంగ్, అమెజాన్, రిలయన్స్, వొడాఫోన్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లాంటి దిగ్గజ సంస్థలున్నాయి. క్వెస్కు విదేశాల్లో కూడా 5 వేల మంది వర్కర్లున్నారు. సింగపూర్ లాంటి మార్కెట్లలో వీరు పనిచేస్తున్నారు. ‘మా దగ్గరున్న ఉద్యోగుల కంటే కూడా తక్కువ జనాభా ఉన్న దేశాలు ఉన్నాయి. ఇండియన్ జాబ్ మార్కెట్పై మా ప్రభావం ఎంతన్నది తెలియదు. ముఖ్యంగా అధికార జాబ్ ఎకానమీలో మేము పోషించే పాత్ర ఏ స్థాయిలో ఉందో చెప్పలేం’ అని క్వెస్ కార్ప్ గ్రూప్ సీఈఓ సూరజ్ మోరాజే చెప్పారు. ఇటీవల ఎకానమీ నెమ్మదించడంతో, ఆటోమొబైల్స్, టెలికాం, ఎఫ్ఎంసీజీ, ఐటీ సర్వీసెస్ కంపెనీల్లో లేఆఫ్స్ ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో కొత్త కంపెనీలు పుంజుకుంటున్నాయి. క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కూడా ఈ కంపెనీలకు ఎక్కువగా ఉంటోంది. అంతేకాక గ్రే కాలర్ జాబ్స్కు వేతనాలు పెరుగుతున్నాయి. ఇన్ఫ్లేషన్ కంటే వేగంగా డెలివరీ బాయ్స్ వేతనాలు పెరిగినట్టు వెంచర్ క్యాపిటల్ సంస్థ ఇండియా కోషెంట్ ఫౌండింగ్ పార్టనర్ ఆనంద్ లూనియా అన్నారు. డెలివరీ వ్యక్తుల వేతనాలు ఒక్కప్పుడు ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో ఉంటే.. ఇవి ఇప్పుడు రూ.20 వేలుగా ఉన్నట్టు పేర్కొన్నారు. అట్రిషన్ (ఉద్యోగుల వలస) రేటు ఎక్కువగా ఉండే కంపెనీలు ఎక్కువగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులనే నియమించుకుంటున్నాయి. అంతేకాదు, కొన్ని తాత్కాలిక పనులకూ ఉద్యోగుల కోసం అవుట్సోర్సింగ్ మీదే ఆధారపడుతున్నాయి. ఈ రెండు కారణాల వల్లే అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయని లూనియా పేర్కొన్నారు.
ఏడాదికి 10 లక్షల మందికి ఇంటర్వ్యూలు…
క్వెస్ కార్ప్ సీఈఓ మోరాజే చెప్పిన దాని ప్రకారం… క్వెస్లో సగటు జీతం 70 శాతం వర్క్ఫోర్స్కు రూ.12 వేల నుంచి 40 వేల మధ్యలో ఉంది. వీరిలో 75 శాతం మంది వయసు 21 నుంచి 35 మధ్యలోనే ఉంది. అట్రిషన్ నెంబర్ను చెప్పడానికి తిరస్కరించిన క్వెస్ కార్ప్… ఏడాదికి 10 లక్షల మందికి పైగా ఉద్యోగులను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు తెలిపింది. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ క్వెస్ కార్ప్.. పీఎఫ్, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ను అందిస్తోన్నట్టు పేర్కొంది. క్వెస్ కార్ప్ను పదేళ్ల క్రితం సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ అజిత్ ఇసాక్ స్థాపించారు. పలు అక్విజిషన్లతో ఇది ముందుకు దూసుకెళ్తోంది. కెనడా బిలీనియర్కు చెందిన ఫెయిర్ఫాక్స్ను ఇది సొంతం చేసుకుంది. 2016లో ఇది మార్కెట్లో కూడా లిస్ట్ అయింది. 10 దేశాల్లో, 2600 మంది క్లయింట్స్కు సేవలందిస్తూ.. 3.85 లక్షల మంది ప్రొఫెషనల్స్తో దేశంలోనే అతిపెద్ద బిజినెస్ సర్వీసు ప్రొవైడర్గా పేరొందింది.
మూడులక్షల మందితో పోటీకి రాబోతున్న స్విగ్గీ….
ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ వచ్చే 18 నెలల్లో మూడు లక్షల మందిని నియమించుకుంటానని అక్టోబర్లో ప్రకటించింది. దీంతో తన ఎంప్లాయీస్ సంఖ్యను 5 లక్షలకు పెంచుకుంటానని చెప్పింది. ఇలా కనుక చేస్తే… దేశంలో అతిపెద్ద ఎంప్లాయర్గా స్విగ్గీ నిలువనుంది. క్వెస్ కార్ప్కు ప్రస్తుతం 3.85 లక్షలున్నారు. ఈ సంఖ్యను స్విగ్గీ ఈ మధ్యలో ఎప్పుడైనా బీట్ చేసే అవకాశం ఉంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత.. ఇండియాలో మూడో అతిపెద్ద ఎంప్లాయిమెంట్ సోర్స్గా నిలువాలని స్విగ్గీ టార్గెట్గా పెట్టుకుంది.