వికారాబాద్, వెలుగు: బీసీ సర్పంచులను ఎవరైనా రాజకీయంగా ఇబ్బందులు పెడితే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. వికారాబాద్లో శనివారం బీసీ సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ నినాదం బలంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ ఉండగా, 52 శాతం సర్పంచ్ స్థానాలు బీసీలు గెలుచుకున్నారని పేర్కొన్నారు.
బీసీల రాజకీయ ఎదుగుదలకు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గుడిసె లక్ష్మణ్ పాల్గొన్నారు.
