జనాభాలో బీసీల లెక్కలు తేల్చాలంటూ మార్చి 18న చలో ఢిల్లీ: కృష్ణయ్య
హైదరాబాద్, వెలుగు: వచ్చే జనాభా గణనలో కులాల వారీ లెక్కలు తీయడానికి అభ్యంతరం ఏంటని కేంద్రాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. ‘జన గణన పట్టికలో 31 కాలమ్స్ ఉన్నాయని, కులాల గణనకు ఇంకో కాలమ్ పెడితే కొంపలు మునిగిపోతాయా?’ అని నిలదీశారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీల జనగణన లెక్కలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 18న చలో ఢిల్లీ చేపడుతున్నామని.. 18, 19, 20 తేదీల్లో 14 బీసీ సంఘాలతో కలిసి పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించిందని, జనాభా లెక్కలు లేకుండా రాజ్యాంగ సదుపాయాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రీమిలేయర్ను తొలగించాలన్నారు. కేంద్ర విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 నుంచి 56 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీ యాక్ట్ తీసుకురావాలని కోరారు.
‘కానిస్టేబుల్’ శిక్షణ తేదీలు ప్రకటించాలి
కానిస్టేబుల్ ట్రైనింగ్కు ఎంపికైన 4,200 మంది క్యాండిడేట్లకు వెంటనే శిక్షణ తేదీలు ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. సెలెక్టయిన వాళ్లలో బడుగు, బలహీన వర్గాల వాళ్లే ఎక్కువున్నారని, 10 నెలలుగా ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ విషయమై గురువారం రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం సమర్పించారు. బోర్డు హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేస్తే తమకు సమాచారం లేదంటున్నారని చెప్పారు.