హైదరాబాద్, వెలుగు: మార్ఫింగ్ ఫొటోలతో వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థినులను వేధించిన నలుగురు పోకిరీలను రాచకొండ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, అందులోని డేటాను రికవరీ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ గ్యాంగ్ వివరాలను శనివారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా కొర్రెపాడుకు చెందిన చొప్పర లక్ష్మీ గణేశ్(19), మేడ ప్రదీప్(19) ఇద్దరూ క్లాస్మేట్స్. ఇంటర్ వరకు చదివారు. గణేశ్ తాడేపల్లిలోని ఓ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. అక్కడే స్థానిక అంజిరెడ్డికాలనీకి చెందిన బాలం సతీశ్(20), అతని సోదరుడు చవల దుర్గాప్రసాద్(19)తో పరిచయం ఏర్పడింది. కాగా గణేశ్ ఇన్స్టా, వాట్సాప్లో యువతుల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వీటిని ఈ నలుగురు షేర్ చేసుకునేవారు. తర్వాత ఆ నంబర్లకు కాల్, మెసేజ్లు చేసి వేధించేవారు.
వీడియా కాల్స్, అసభ్యకర ఫొటోలు..
వాట్సాప్లోని అమ్మాయిల డీపీలను సేకరించడం అలవాటుగా మార్చుకున్నారు. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడేవారు. వారి పర్సనల్ డేటాను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవారు. అమ్మాయిల నంబర్లను వాట్సాప్లో పలు గ్రూపుల్లో యాడ్ చేసేవారు. ఇలాగే వీబీఐటీ కాలేజ్కి చెందిన ఓ యువతిని పరిచయం చేసుకుని, ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు. ఆమె ఫ్రెండ్స్తో పాటు కాలేజ్ స్టూడెంట్ల నంబర్లను కలెక్ట్ చేశారు. వారు క్రియేట్ చేసిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో యాడ్ చేసి.. వీడియా కాల్స్, అసభ్యకర ఫొటోలు పెడుతూ వేధించారు. దీంతో విద్యార్థినులు కాలేజ్ వార్డెన్ కు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఘట్కేసర్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి ఆ నలుగురు నిందితు
లను విజయవాడలో అరెస్ట్ చేశారు. సిటీకి తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు.