
Rafale News: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత డిఫెన్స్ రంగంలో పెద్ద మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాల నుంచి ఇండియన్ డిఫెన్స్ సంస్థలకు ఆర్డర్లు వస్తుండగా.. రఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ముందుకు రావటం గమనార్హం.
వివరాల్లోకి వెళితే భారత అమ్ములపొదిలో చేరిన రఫెల్ యుద్ధ విమానాలు ఎంత శక్తివంతమైనవో మనందరికీ తెలిసిందే. మరికొన్ని రఫెల్స్ డెలివరీ ఫ్రాన్స్ నుంచి అందాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేక్ ఇన్ ఇండియాలో తాము కూడా భాగస్వామిగా కావాలని నిర్ణయించిన డసాల్ట్ ఏవియేషన్స్ టాటాలకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీలో కంపెనీ రఫెల్ యుద్ధ విమానాల "ఫ్యూజ్లేజ్" తయారీకి ముందుకొచ్చింది.
మెుదటి సారిగా డసాల్ట్ ఏవియేషన్ రఫెల్ యుద్ధ విమానాల "ఫ్యూజ్లేజ్"లను ఫ్రాన్స్ బయట తయారు చేయాలనుకోవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. టాటాలతో జరిగిన ఒప్పందం ప్రకారం టాటా అడ్వాన్స్డ్ అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన కీలకమైన స్ట్రక్చరల్ భాగాలను తయారు చేయనున్నారు. ప్రధానంగా యుద్ధ విమానానికి సంబంధించిన బాడీ మధ్య భాగం, వెనుక భాగం, ముందు భాగం హైదరాబాదులోనే నిర్మించబడనున్నాయి.
2028 నాటికి ఈ అసెంబ్లింగ్ లైన్ అందుబాటులోకి వస్తుందని డసాల్ట్ ప్రకటించింది. దీని నుంచి నెలకు రెండు "ఫ్యూజ్లేజ్"లను డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే టాటాలు బోయింగ్ విమానాలకు సంబంధించిన బాడీలను తమ హైదరాబాద్ ఫెసిలిటీలో తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాలు భారత ఏరోస్పేస్ రంగంలో కొత్త చరిత్రకు ప్రారంభంగా తెలుస్తోంది. పైగా టాటాలకు ప్రపంచ వ్యాప్తంగా నమ్మకాన్ని పెంచుతోంది. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 36 రఫెల్ జెట్ విమానాలు దేశ భద్రత సేవల్లో కొనసాగుతున్న తరుణంలో డీల్ రావటం గమనార్హం.