
దుబ్బాక, వెలుగు: అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా దుబ్బాకలో ఎగిరేది బీజేపీ జెండానేనని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలం కోనాపూర్ సర్పంచ్, వార్డు సభ్యులు, మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు.
ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని, తాను చేపట్టిన ప్రచారానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే బీజేపీతోనే సాధ్యమని, అటు దేశంలో ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని పేర్కొన్నారు. అనంతరం పలువురు బాధితులను పరామర్శించాడు.