దుబ్బాక, వెలుగు: జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అవమానాలు.. ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయినా ఎక్కడా అధైర్య పడలేదు.. ఓటములనే ఒక్కొక్క మెట్టుగా మలుచుకుంటూ ముందుకు వెళ్లారు మాధవనేని రఘునందన్రావు. బీజేపీ క్యాండిడేట్గా దుబ్బాక బై ఎలక్షన్లో గెలిచి సత్తా చాటారు.
రిపోర్టర్గా కెరీర్ మొదలు పెట్టి..
రఘునందన్రావు 1968లో భగవంతరావు, భారతి దంపతులకు సిద్దిపేటలో జన్మించారు. డిగ్రీ వరకు సిద్దిపేటలోనే చదువుకున్న ఆయన రిపోర్టర్గా తన కెరీర్ మొదలుపెట్టారు. జర్నలిస్టుగా కొనసాగుతున్న టైంలోనే వివిధ రాజకీయ, సామాజిక అంశాలపై పట్టు సాధించారు. ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ కంప్లీట్ చేసి, లాయర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ లో అడ్వకేట్ గా చేరారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించడంతో రఘునందన్ ఆ పార్టీలో చేరి ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. టీఆర్ఎస్ పొలిట్బ్యూరో మెంబర్గా, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2009లో టీఆర్ఎస్ తరఫున లోకల్బాడీ ఎమ్మెల్సీగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. పొలిట్బ్యూరో మెంబర్గా ఉండి, టీడీపీ చీఫ్ చంద్రబాబును కలిశారనే ఆరోపణలతో 2013లో టీఆర్ఎస్ హైకమాండ్రఘునందన్రావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో బీజేపీలో చేరిన రఘునందన్ రావు.. తన సొంత నియోజకవర్గం దుబ్బాకలో బీజేపీని బలోపేతం చేసే దిశగా పని చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మెదక్ లోక్సభ స్థానానికి బీజేపీ తరపున బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. సొంత ప్రాంతంలో పలుమార్లు ఓటములు, అవమానాలు ఎదురైనప్పటికీ రఘునందన్రావు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎప్పటికప్పుడు బీజేపీ కేడర్కు అండగా ఉంటూ వచ్చారు. రఘునందన్రావుకు మంచి వక్తగా గుర్తింపు ఉంది. వివిధ వేదికలపై, ముఖ్యంగా టీవీ డిబేట్స్లో వివిధ అంశాలపై తన ఒపీనియన్స్ వెల్లడించేవారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను తన పదునైన మాటలతో ఎండగట్టడంలో రఘునందన్రావు దిట్ట.