
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నియోజకవర్గంలో వేలాది మంది దొంగ ఓట్లు వేశారని చెప్పారు. డిజిటల్ ఓటర్ లిస్టు, పోలింగ్ రోజు నాటి సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో రాహుల్ పోస్టు పెట్టారు. 2024 లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మధ్య 6 నెలల గ్యాప్ ఉండగా.. ఆ వ్యవధిలో ఫడ్నవీస్ నియోజకవర్గమైన నాగ్పూర్ సౌత్ వెస్ట్లో 29,219 మంది కొత్త ఓటర్లు నమోదైనట్టు మీడియాలో వచ్చిన రిపోర్టును తన పోస్టుకు జత చేశారు.
‘‘మహారాష్ట్ర సీఎం సొంత నియోజకవర్గంలో కేవలం 6 నెలల్లో ఓటర్ల లిస్టు 8 శాతం పెరిగింది. కొన్ని పోలింగ్ బూత్లలో అయితే 20 నుంచి 50 శాతం పెరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓట్లు వేసినట్టు బీఎల్వోలు గుర్తించారు. వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదైనట్టు మీడియా బయటపెట్టింది. దీనిపై ఈసీ మౌనంగా ఉంటున్నదా? లేక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదా? ఇది ముమ్మాటికీ ఓటు దొంగతనమే. దీన్ని కవర్ చేసుకోవాలని చూస్తున్న ఈసీ.. చేసిన తప్పును ఒప్పుకున్నట్టే. అందుకే మేం డిజిటల్ ఓటర్ లిస్టు, సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం” అని పోస్టులో రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్కు ఫడ్నవీస్ కౌంటర్..
రాహుల్ కామెంట్లకు ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు. ఇంకెన్ని రోజులు అబద్ధాలు ప్రచారం చేస్తారని ‘ఎక్స్’లో మండిపడ్డారు. ‘‘మహారాష్ట్రలో మీకు (రాహుల్) ఎదురైన అవమానకరమైన ఓటమి.. మిమ్మల్ని ప్రతిరోజు బాధిస్తున్నదని నాకు అర్థమైంది. కానీ ఎన్ని రోజులు ఇలా చీకట్లో బాణాలు వేస్తారు? లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య.. రాష్ట్రంలోని 25కు పైగా నియోజకవర్గాల్లో ఓటర్ లిస్టు 8 శాతానికి పైగా పెరిగింది. వీటిలో కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి. మీరు ఇలాంటి ఆరోపణలు చేసేముందు మీ ఎమ్మెల్యేలతో ఒకసారి మాట్లాడితే బాగుండేది” అని రాహుల్కు ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు.