అహ్మదాబాద్ హైకోర్టు అనర్హతపై.. సుప్రీంకోర్టు స్టే విధించటంతో.. రాహుల్ గాంధీ ఎంపీ పదవిని తిరిగి పునరుద్దరిస్తూ.. లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీలు స్వీట్లు పంచుకున్నారు. పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అయితే అందరికీ స్వీట్లు పంచారు. విషయం తెలిసిన వెంటనే.. స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే.. రాహుల్ గాంధీ పార్లమెంట్ కు చేరుకున్నారు.
కారులో వచ్చిన రాహుల్.. వెంటనే వడివిడిగా లోపలికి వెళ్లిపోయారు. మీడియా మాట్లాడాలని కోరినా.. నవ్వుతూ లోపలికి వెళ్లిపోయారు. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీకి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. అంతకుముందు మహాత్మాగాంధీ విగ్రహం ముందు నివాళులు అర్పించారు. ఇక ప్రధాని మోదీ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై 2023 ఆగస్టు 8వ తేదీ నుంచి లోక్సభలో చర్చ జరగనుంది. ఈ చర్చలోనూ రాహుల్ పాల్గొననున్నారు.
రాహుల్గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు స్పీకర్ కార్యాలయం ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్ష అమలుపై ఇటీవల సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో రాహుల్కు గరిష్ట శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎలాంటి కారణాలు చెప్పలేదని వ్యాఖ్యానించింది. దీంతో రాహుల్ను దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కేసు ఎంటీ?
‘మోదీ ఇంటి పేరు’పై చేసిన వ్యాఖ్యలకు 2019లో రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చి 23న సూరత్లోని సెషన్స్ కోర్టు ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే లోక్సభ సచివాలయం ఆయన సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. దీన్ని హైకోర్టులో రాహుల్ అప్పీల్ చేయగా చుక్కెదురైంది. చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును రాహుల్ ఆశ్రయించారు. దీనిపై 2023 ఆగస్టు 4 తేదీన విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. జైలు శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎప్పుడు ఏం జరిగిందంటే..
- 2019 ఏప్రిల్ 13: కర్నాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలందరికీ ‘మోదీ’ అనే కామన్ ఇంటి పేరు ఎందుకు ఉంది?” అని ప్రశ్నించారు.
- 2019 ఏప్రిల్ 15: సూరత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశారు.
- 2019 జులై 7: సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట రాహుల్ తొలిసారి హాజరయ్యారు.
- 2023 మార్చి 23: పరువునష్టం కేసులో రాహుల్ తప్పు చేసినట్లు నిర్ధారిస్తూ.. ఆయనకు రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది.
- 2023 మార్చి 24: రెండేండ్ల జైలుశిక్ష పడినందుకు రాహుల్ ఎంపీగా అనర్హత వేటుకు గురయ్యారు.
- 2023 ఏప్రిల్ 2: సూరత్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో రాహుల్ సవాలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా అక్కడ పెండింగ్లో ఉంది.
- 2023 ఏప్రిల్ 20: రాహుల్కు బెయిల్ ఇచ్చిన సెషన్స్ కోర్టు.. తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది.
- 2023 ఏప్రిల్ 25: కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును రాహుల్ఆశ్రయించారు.
- 2023 జులై 7: రాహుల్ అభ్యర్థనను హైకోర్టు డిస్మిస్ చేసింది.
- 2023 జులై 15: గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
- 2023 జులై 21: గుజరాత్ మంత్రి పూర్ణేశ్ మోదీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.
- 2023 ఆగస్టు 4: రాహుల్కు విధించిన జైలు శిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే