6 రోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ.. కరోనా వ్యాప్తి కోరుకుంటున్నారా?

6 రోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ.. కరోనా వ్యాప్తి కోరుకుంటున్నారా?

దేశంలో ఒక్కొక్కటిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించడంపై బీజేపీ పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ పర్యటనను తప్పుబట్టడం లేదని, ప్రజల్లోకి రాజకీయ నేతలు వెళ్లి ధైర్యం చెప్పడం మంచిదేనని అంటూనే కానీ దీనికి ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించారో చెప్పాలన్నారు బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి. ఆరు రోజుల క్రితమే రాహుల్ గాంధీ ఇటలీ నుంచి వచ్చారని, ఆ దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు. ఎయిర్‌పోర్టులో ఆయన స్క్రీనింగ్ టెస్టు చేయించుకున్నారా లేదా చెప్పాలని అడిగారు. అలాగే కరోనా వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకున్నారా? లేక వైరస్‌ను వ్యాపింపజేయాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు ఎంపీ రమేశ్.

భారత్‌లో రెండు మూడ్రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వాళ్లే. ఢిల్లీలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి కూడా ఇటలీ నుంచే వచ్చాడు. మరోవైపు ఇటలీలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఆ దేశంలో ఇప్పటికే 80 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 2500 మందికి పైగా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు రెండు వారాల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ఇటలీ. ఇక కరోనా వైరస్ పుట్టిన చైనాలో 80 వేల మందికిపైగా కరోనా సోకింది. దాదాపు 3 వేల మంది మరణించారు.