న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల మూల్యాంకనంలో అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీబీఎస్ఈ ఫలితాలల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. వరుసగా ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. భారతదేశ సాంకేతిక, శాస్త్రీయ పురోగతిని అతడు నిరంతరం వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.
ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ వెంటనే తిప్పికొట్టారు. లక్షలాది మంది విద్యార్థుల తరుఫున ప్రశ్నిస్తున్న తనను మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు ఆపలేవన్నారు. నన్ను ఎంతకావాలంటే అంత తిట్టుకోవచ్చు.. కానీ నన్నెంత విమర్శించినా తప్పులు దాచలేరు.. తనపై దాడి చేసి తప్పులను కప్పిపుచ్చుకోలేరన్నారు.
లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఎన్ని విమర్శలు ఎదురైనా 18.5 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. గతంలోనే వివాదాల్లో చిక్కుకున్న కోఎంప్ట్ (COEMPT) కంపెనీకి సీబీఎస్ఈ పేపర్ల మూల్యాంకన కాంట్రాక్టును ఎందుకు అప్పగించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
