లద్ధాఖ్లో రాహుల్ గాంధీ బైక్ రైడ్..

లద్ధాఖ్లో రాహుల్ గాంధీ బైక్ రైడ్..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బైక్పై దూసుకెళ్లాడు. లద్ధాఖ్ రోడ్లపై రయ్ రయ్ మంటూ బైక్ రైడ్ చేశాడు. ఓ వైపు పాంగాంగ్ సరస్సు..మరోవైపు చుట్టూ కొండల మధ్య రాహుల్ గాంధీ బైక్ నడిపిస్తుంటే..చూసి వాళ్లంతా వావ్ అనక తప్పదు.

ప్రస్తుతం రాహుల్ గాంధీ కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని లేహ్‌ లో పర్యటిస్తున్నారు.  ఈ సందర్భంగా భారత్‌ -చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు కు ఆగస్టు 19వ తేదీన రాహల్ గాంధీ బైక్‌  రైడ్‌ చేపట్టారు. రోడ్డుపై రాహుల్ గాంధీ బైక్ డ్రైవ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బైక్ ను డ్రైవ్ చేయడానికి ముందు రాహుల్ మాట్లాడారు. వరల్డ్ లోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటి..తన తండ్రి రాజీవ్‌ గాంధీ చెప్పేవారని రాహుల్ గాంధీ తెలిపారు. అందుకే ఇక్కడ బైక్ డ్రైవ్ చేయడం సంతోషంగా ఉందన్నారు.  2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్‌ గాంధీ లద్దాఖ్‌కు తొలిసారి వచ్చారు. ఆగస్టు 18వ తేదీన ఆయన లేహ్‌లోని యువతతో సంభాషించారు.

ఆగస్టు 20వ తేదీన మాజీ ప్రధాని, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ జయంతి. ఈ జయంతిని పాంగాంగ్ సరస్సు దగ్గర రాహుల్ గాంధీ చేసుకోనున్నారు. ఇందులో భాగంగా లద్ధాఖ్ వెళ్లిన ఆయన..ఆగస్టు 19వ తేదీన  పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉన్న టూరిస్ట్‌ క్యాంప్‌లో బస చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 

మరోవైపు సెప్టెంబరు 10న లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌  కార్గిల్‌  ప్రాంతంలో కౌన్సిల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ .. స్థానిక నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీతో కలిసి బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ.. లేహ్‌ పర్యటన ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ లద్ధాఖ్ స్థానిక కాంగ్రెస్‌ నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది.