మధ్యప్రదేశ్, చత్తీస్‌‌గఢ్‌‌లో కచ్చితంగా వచ్చేది మేమే: రాహుల్

మధ్యప్రదేశ్, చత్తీస్‌‌గఢ్‌‌లో కచ్చితంగా వచ్చేది మేమే: రాహుల్
  • రాజస్థాన్‌‌లో విజయానికి దగ్గరగా ఉన్నం
  • ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తున్నయ్​
  • 2024 లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యపోతది
  • కర్నాటకలో మేం ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నం
  • ప్రజలకు స్పష్టమైన విజన్ ఇచ్చి గెలిచినం
  • అసోంకు చెందిన ‘ప్రతిదిన్ మీడియా నెట్‌‌వర్క్’ సదస్సులో కామెంట్స్

న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తమకు విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాజస్థాన్‌‌‌‌లో గెలుపునకు దగ్గరగా ఉన్నామన్నారు. అస్సాంకు చెందిన ‘ప్రతిదిన్ మీడియా నెట్‌‌‌‌వర్క్’ నిర్వహించిన కాంక్లేవ్‌‌‌‌లో రాహుల్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతున్నదన్నారు. ‘‘తెలంగాణలో బీజేపీ రేసులో లేదు. ఆ పార్టీ పని అయిపోయింది’’ అని అన్నారు. 

ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని, 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యపోతుందన్నారు. ప్రజలను సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ను తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇది బీజేపీ దృష్టి మళ్లింపు వ్యూహాల్లో ఒకటి అని అన్నారు. ‘‘ఎంపీ బిధూరి వ్యాఖ్యలు, జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు వంటివన్నీ దృష్టి మళ్లించేందుకే. ఇదంతా మాకు తెలుసు. మేం అర్థం చేసుకున్నాం. వాళ్లను చేయనివ్వబోం” అని పేర్కొన్నారు. 

కర్నాటకలో ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నం

వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ అవకాశాలపై రాహుల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతానికి తెలంగాణలో మేం గెలిచే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌‌‌‌ను, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ను కచ్చితంగా గెలుస్తాం. రాజస్థాన్‌‌‌‌లో విజయం సాధించగలమని భావిస్తున్నాం. బీజేపీ అంతర్గతంగా చెబుతున్నది కూడా అదే’’ అని చెప్పారు. ‘‘కర్నాటకలో కాంగ్రెస్ చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది. దృష్టి మరల్చడం ద్వారా, మేం చేయాలనుకున్నది చెప్పనీయకుండా చేసి బీజేపీ గెలుస్తున్నదని గుర్తించాం. అందుకే మేము మా పార్టీ ఏం చేస్తుందో చెబుతూ ఎన్నికల్లో పోరాడాం” అని వివరించారు. 

ఈ రోజు మీరు చూస్తున్నారు.. ముందు ఎంపీ బిధూరి, తర్వాత నిశికాంత్ దూబే వచ్చారు. ఇదంతా కుల గణన ఆలోచన నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం’’ అని మండిపడ్డారు. ‘‘మేం ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తిన ప్రతిసారి.. వాళ్లు దృష్టిని మరల్చడానికి ఇలా చేస్తారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది మేం ఇప్పుడు నేర్చుకున్నాం. మేము కర్నాటకలో ప్రజలకు స్పష్టమైన విజన్ ఇచ్చాం. ఇది మీ కోసం మేం ఏర్పాటు చేయబోయే సామాజిక భద్రతా కార్యక్రమని తెలియజేశాం’’ అని రాహుల్ తెలిపారు. ‘‘ప్రతిపక్షాలు ఇప్పుడు కలిసి పని చేస్తున్నాయి. ప్రతిపక్షాలన్నీ కలిస్తే దేశ జనాభాలో 60% ఉన్నాం. 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యానికి గురవుతుంది’’ అని చెప్పారు.

రేపు పొద్దునే అమలు చేయొచ్చు

మహిళా రిజర్వేషన్ బిల్లును రేపు పొద్దున్నే అమలు చేయొచ్చని రాహుల్ అన్నారు. లోక్‌‌‌‌సభ, అసెంబ్లీల్లో 33% సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని చెప్పడం మాత్రమే చేయాల్సి ఉందన్నారు. మహిళా రిజర్వేషన్‌‌‌‌కు.. జనాభా లెక్కింపు, నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘‘పదేళ్ల తర్వాత మహిళలు లబ్ధి పొందుతారని ప్రభుత్వం చెబుతున్నది.. కానీ అది ఇప్పుడే చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది” అని అన్నారు. అదానీ వ్యవహారంలో మీడియా కథనాల నుంచి దృష్టి మళ్లించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌‌‌‌ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. ‘‘ముందుగా ఇండియా పేరును భారత్‌‌‌‌గా మార్చాలని వాళ్లు ప్లాన్ చేశారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు దీన్ని స్వాగతించరని బీజేపీ గుర్తించింది. దీంతో దాన్ని వెనక్కి నెట్టి ప్రత్యేక సెషన్‌‌‌‌తో ముందుకు వచ్చింది” అని చెప్పారు.   

అందుకే యాత్ర చేశా

దేశంలో మీడియాపై బీజేపీ పట్టు సాధించిందని, ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా వక్రీకరణ జరుగుతున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘కమ్యూనికేషన్ వ్యవస్థను బీజేపీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. దీంతో మాకు ప్రజలతో మాట్లాడటం సాధ్యం కాదు. నా యూట్యూబ్ చానల్, ట్విట్టర్ ఖాతాను అణచివేశారని అర్థమైంది. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా.. జాతీయ మీడియా వక్రీకరిస్తున్నది. అందుకే భారత్ జోడో యాత్ర తప్పనిసరైంది. మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రజలతో మమేకమయ్యా. ఈ పాత విధానం నేటికీ పనిచేస్తుందని తెలుసుకున్నా” అని వివరించారు. ‘‘సంపద ఒకే చోట పోగవుతోంది. నిరుద్యోగం, ధరలు పెరిగిపోతున్నాయి. ఓబీసీలు, గిరిజన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది” అని అన్నారు.