
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా అట్టర్ ప్లాప్ అయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని మోదీ నినాదాలు ఇవ్వడంలోనే మాస్టర్ అని పరిష్కారాలు చూపడంలో కాదని ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఉన్నప్పటికీ భారత్ లో తయారీ రంగం కనిష్టానికి పడిపోయిందని తెలిపారు. ఢిల్లీలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ ‘నెహ్రూ ప్లేస్’లో పర్యటించిన రాహుల్ గాంధీ.. అక్కడ పనిచేసే ఇద్దరు టెక్నీషియన్లతో ముచ్చటించారు. అందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.“మేకిన్ ఇండియాతో ఫ్యాక్టరీ రంగం అమాంతం పెరుగుతుందని కేంద్రం చెప్పింది.
మరి ఎందుకు తయారీ రంగం పడిపోయింది? యువత నిరుద్యోగిత రేటు ఎందుకు భారీగా పెరిగింది? చైనా నుంచి దిగుమతులు ఎందుకు రెండింతలు అయ్యాయి?” అని ఆయన ప్రశ్నించారు. ‘‘మనం ఇతరులకు మార్కెట్ గా ఉండకూడదు. ఇక్కడే ఉత్పత్తి చేస్తే.. ఇక్కడే కొనుగోళ్లు చేస్తాం. సమయం లేదు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. మనం వస్తువులను అసెంబ్లింగ్ చేస్తున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. తయారు చేయట్లేదు. అందుకే వాటిని తయారుచేస్తున్న చైనా లాభపడుతోంది” అని ఆయన పేర్కొన్నారు. కాగా, రాహుల్ విమర్శలకు బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతిని ఆయన చూడలేకపోతున్నారని మండిపడింది. ఇండియా అభివృద్ధిని అణగదొక్కడంలో ఆయన బిజీగా ఉన్నారని ఆరోపించింది.