
- రాహుల్ గాంధీ ఆరోపణలు
- రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారం
రాయ్బరేలీ : తన కుటుంబం రాయ్బరేలీ కోసం పనిచేస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం అంబానీ, అదానీల కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఇక్కడి ప్రజలతో తన కుటుంబానికి ఎన్నో ఏండ్ల అనుబంధం ఉందని గుర్తుచేశారు.
అందుకే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్గాంధీ, తల్లి సోనియాగాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు. మోదీ మాత్రం 20 నుంచి 25 మంది బడా వ్యాపారులకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు.
త్వరలోనే పెండ్లి చేస్కుంట..
పెండ్లి ఎప్పుడనే విషయంపై రాహుల్ సరదాగా స్పందించారు. త్వరలోనే తాను పెండ్లి చేసుకోబోతున్నానని చెప్పారు. రాయ్బరేలీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ఎమోషనల్గా మాట్లాడుతున్న సమయంలో అభిమానుల నుంచి పెండ్లెప్పుడు అనే ప్రశ్న వచ్చింది. దీనికి ఆయన నవ్వుతూ తొందరలోనే చేసుకుంటా అని సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆపై తన ప్రసంగాన్ని ముగించేముందు తన సోదరి ప్రియాంకా గాంధీని రాహుల్ వేదిక మీదికి పిలిచారు. ఆమె భుజాలపై చేయివేయి ఆప్యాయంగా మాట్లాడారు. తాను ఎన్నికల సందర్భంగా దేశమంతటా పర్యటిస్తుంటే, ప్రియాంక తన కోసం రాయ్బరేలీలో ప్రచారం నిర్వహిస్తున్నారంటూ కృతజ్ఞతలు చెప్పారు.