
భారత్ జోడో యాత్రతో ప్రజలకు మరింత దగ్గరయ్యానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. జోడో యాత్ర తనలో చాలా మార్పు తీసుకువచ్చిందని చెప్పారు. ఛత్తీస్ గఢ్ రాయ్పూర్లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టితో ప్లీనరీ ముగియనున్న సందర్భంలో భారత్ జోడో యాత్రను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. జోడో యాత్ర సాగిన 145 రోజులు దేశప్రజలే తనకు ఇల్లుగా భావించానని.. ప్రజల కష్టాలు దగ్గరనుంచి చూశానని చెప్పారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నానన్నారు. ప్రజల నుంచి భారత్ జోడో యాత్రకు మద్దతు లభించిందని రాహుల్ తెలిపారు. తన యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్కు పూర్వవైభవం రానుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.