మణిపూర్లో పర్యటించనున్న రాహుల్... షెడ్యూల్ ఖరారు

మణిపూర్లో పర్యటించనున్న రాహుల్... షెడ్యూల్ ఖరారు

గత రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ ఖరారైంది.  2023 జూన్ 29,30 తేదీల్లో రాహుల్ మణిపూర్ లో పర్యటిస్తారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు..  

ఇంఫాల్‌, చురచంద్‌పుర్‌లలోని పునరావస కేంద్రాల్లో ఉంటున్న బాధితులను రాహుల్ పరామర్శించనున్నారు. అలాగే అల్లర్లు ఎక్కువగా జరిగిన ప్రాంతాలను కూడా రాహుల్ పరిశీలిస్తారని వేణుగోపాల్ తెలిపారు. దాదాపు రెండు నెలలుగా మండుతోన్న మణిపుర్‌లో శాంతి స్థాపన దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

దీన్నొక మానవతా విషాదంగా పేర్కొన్న కేసీ వేణుగోపాల్‌.. అక్కడి పరిస్థితుల పట్ల ద్వేషంతో కాకుండా ప్రేమగా వ్యవహరించడం మన బాధ్యత అంటూ ట్వీట్‌ చేశారు.  మే 3న ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుండి దాదాపుగా  100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.