సంస్థలో ఉద్యోగులపై రిపోర్టుకు రైల్వే బోర్డు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తమ సంస్థలో పనితీరు సరిగ్గా లేని, పనిచేయలేని పరిస్థితిలో ఉన్న ఉద్యోగుల వివరాలను రైల్వే బోర్డు సేకరిస్తోంది. సంస్థలో ఎవరు మంచిగా పనిచేయగలరు? ఎవరు చేయలేరు? ఇలా ఎంత మంది ఉన్నారు? అనే లెక్కలు తీస్తోంది. 30 ఏండ్ల సర్వీస్ లేదా 55 ఏండ్ల వయసు దాటి పనిచేయలేని పరిస్థితిలో ఉన్న వారి లిస్ట్ను డివిజన్ల వారీగా తీసుకుంటోంది. గతంలోనే ఈ లెక్కలు తీయాలని భావించగా.. కొన్ని కారణాలతో ఆగిపోయింది. తాజాగా మళ్లీ రైల్వే బోర్డు నుంచి అన్ని జోన్లకు అంతర్గత ఉత్తర్వులు అందాయి. అధికారులు కూడా సీరియస్గా వర్కవుట్ చేస్తున్నట్లు తెలిసింది. ఇలా లెక్కలు తీస్తుండటంతో కొందరికి వీఆర్ఎస్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంప్లాయీస్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
లిస్టు ప్రిపేర్ చేయండి
30 ఏండ్ల సర్వీస్ లేదా 55 ఏండ్ల వయసు దాటి పనితీరు సరిగాలేని వారి లిస్ట్ ప్రిపేర్ చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కూడా అన్ని డివిజన్లకు ఆదేశాలు ఇచ్చింది. 2019 డిసెంబర్ 31 వరకు అన్ని రకాలు చర్యలు తీసుకోవాలని కోరింది. కానీ ఇప్పటిదాకా ఏ జోన్ కూడా దీనిపై పెద్దగా స్పందించలేదు. దీంతో మరోసారి ఈ నెల 6న డీఆర్ఎం(డివిజనల్ రైల్వే మేనేజర్)లకు దక్షిణ మధ్య రైల్వే నోట్ పంపింది. ఉద్యోగుల లిస్ట్ ప్రిపేర్ చేసే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఫిబ్రవరి 28లోపు రిపోర్ట్ పంపించాలని సూచించింది. దీంతో అధికారులు కూడా దీనిపై సీరియస్ వర్కవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వీఆర్ఎస్సేనా?
దేశ వ్యాప్తంగా రైల్వేలో 13లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. ఇందులో 3 లక్షల మందికి వీఆర్ఎస్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 81వేలమంది ఉద్యోగులు ఉండగా, ఇందులో సుమారు 15వేల మంది వరకు 55ఏండ్లు దాటిన వాళ్లు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో సర్వీస్లో కొనసాగడానికి అనర్హులుగా తేలితే వీఆర్ఎస్ ఇస్తారన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. లిస్ట్లో తమ పేరుంటుందేమోనని కలవరపడుతున్నారు. అయితే ఇటీవల వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు టెలికాం మంచి ప్యాకేజీ ప్రకటించారు.
ఎంత కాలం సర్వీస్ ఉందో అంత మొత్తం చెల్లిస్తామని చెప్పడంతో పెద్ద సంఖ్యలో వీఆర్ఎస్ తీసుకున్నారు. కానీ రైల్వే ఆ విధంగా ఉండదని అధికారులు చెబుతున్నారు. సాధారణ రిటైర్మెంట్ తీసుకుంటే ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయో, వీఆర్ఎస్ తీసుకున్నవారికి కూడా అవే వర్తిస్తాయని పేర్కొంటున్నారు. ఇక లిస్ట్ ప్రిపేర్, వీఆర్ఎస్పై యూనియన్లు మండిపడుతున్నాయి. ఈ ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ప్యాసింజర్స్కు మెరుగైన సౌకర్యాలు, మరింత సేఫ్టీ కల్పించడానికే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు.