
- దొంగను అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు
సికింద్రాబాద్, వెలుగు: రైళ్లలో మహిళల మెడలోని బంగారు గొలుసులను తెంపుకెళ్లే దొంగను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద సుమారు రూ.9 లక్షల విలువైన14.3 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే అడిషనల్డీజీ మహేశ్ భగవత్, రైల్వే ఎస్పీ షేక్ సలీమాతో గురువారం మీడియాకు వివరాలు తెలిపారు.
సికింద్రాబాద్ న్యూ బోయిగూడ రైల్వే క్వార్టర్స్లో ఉండే రాఘవులు కొడుకు చిన వీర రాఘవులు ఆకాశ్(23) ఇంటర్ మధ్యలోనే ఆపేశాడు. జెప్టోలో డెలివరీ బాయ్ గా పని చేస్తూ.. స్మోకింగ్, తాగుడుకు బానిసయ్యాడు. వచ్చే జీతం డబ్బులు సరిపోకపోతుండగా.. రైళ్లలో చోరీలకు ప్లాన్ చేశాడు. సికింద్రాబాద్రైల్వే స్టేషన్కు వచ్చి బంగారు నగలు ధరించిన మహిళలను టార్గెట్గా చేసుకుని రైలు ఎక్కేవాడు.
రైలు కదిలే సమయంలో మహిళల మెడలోనుంచి గోల్డ్ చైన్లు లాక్కొని రైలు దిగి పారిపోయేవాడు. బాధిత మహిళా ప్రయాణికుల ఫిర్యాదుతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నిఘా పెట్టారు. గురువారం పదో నంబర్ ప్లాట్ఫాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆకాశ్ను అదుపులోకి తీసుకుని చెక్ చేశారు. అతని వద్ద బంగారుగొలుసు లభించింది. నిందితుడిని రైల్వే కోర్టులో హాజరుపరచి అనంతరం రిమాండ్కు తరలించారు