ఈజీ మనీ కోసం రైళ్లలో చైన్ స్నాచింగ్ లు .. 14.3 తులాల బంగారు నగలు స్వాధీనం

ఈజీ మనీ కోసం రైళ్లలో చైన్ స్నాచింగ్ లు .. 14.3 తులాల బంగారు నగలు స్వాధీనం
  • దొంగను అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు 

సికింద్రాబాద్, వెలుగు: రైళ్లలో మహిళల మెడలోని బంగారు గొలుసులను తెంపుకెళ్లే దొంగను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద సుమారు రూ.9 లక్షల విలువైన14.3 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.  సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో  రైల్వే అడిషనల్​డీజీ మహేశ్​ భగవత్​, రైల్వే ఎస్పీ షేక్​ సలీమాతో  గురువారం మీడియాకు వివరాలు తెలిపారు.  

సికింద్రాబాద్​ న్యూ బోయిగూడ రైల్వే క్వార్టర్స్​లో ఉండే రాఘవులు కొడుకు  చిన వీర రాఘవులు ఆకాశ్​(23) ఇంటర్ మధ్యలోనే ఆపేశాడు.  జెప్టోలో డెలివరీ బాయ్ గా పని చేస్తూ.. స్మోకింగ్, ​తాగుడుకు బానిసయ్యాడు. వచ్చే జీతం డబ్బులు సరిపోకపోతుండగా..  రైళ్లలో చోరీలకు ప్లాన్ చేశాడు. సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​కు వచ్చి బంగారు నగలు ధరించిన మహిళలను టార్గెట్​గా చేసుకుని రైలు ఎక్కేవాడు. 

రైలు కదిలే సమయంలో మహిళల మెడలోనుంచి గోల్డ్​ చైన్లు లాక్కొని  రైలు దిగి పారిపోయేవాడు. బాధిత మహిళా ప్రయాణికుల ఫిర్యాదుతో  సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు నిఘా పెట్టారు. గురువారం పదో నంబర్ ప్లాట్​ఫాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆకాశ్​ను అదుపులోకి తీసుకుని చెక్​ చేశారు. అతని వద్ద బంగారుగొలుసు లభించింది. నిందితుడిని  రైల్వే కోర్టులో హాజరుపరచి అనంతరం రిమాండ్​కు తరలించారు