మళ్లీ వర్షం టెన్షన్.. భారత్-ఇంగ్లండ్ రెండో టీ20 జరిగేనా?

మళ్లీ వర్షం టెన్షన్.. భారత్-ఇంగ్లండ్ రెండో టీ20 జరిగేనా?

IND vs ENG 2nd T20I: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు (జూలై 4, శనివారం) మాంచెస్టర్‌లోని ప్రతిష్టాత్మక ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన రెండో టి20 మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. జూలై 1న చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ప్రస్తుతం 0–0తో నిలిచిన ఈ సిరీస్‌లో ఎలాగైనా గెలిచి ముందంజ వేయాలని ఇరు జట్లు చూస్తున్నాయి. వాతావరణ సూచనలు మాత్రం అభిమానులను, ఆటగాళ్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

రెండో టీ20కి వర్షం ముప్పు: 
భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు (స్థానిక సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, బీబీసీ (BBC) వాతావరణ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభ సమయానికి సుమారు 40 శాతం వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయం గడిచేకొద్దీ ఈ వర్షం తీవ్రత మరింత పెరిగి 60 నుంచి 70 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ కూడా టాస్ పడకుండానే రద్దవుతుందా లేదా ఓవర్లను కుదించి నిర్వహిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

ఆకట్టుకున్న టీమిండియా బ్యాటర్లు: 
తొలి టీ20 మ్యాచ్ పూర్తి కాకపోయినప్పటికీ, మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 189 రన్స్ సాధించింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (1), ఇషాన్ కిషన్ (0) ప్రారంభంలోనే వెనుతిరిగి నిరాశపరిచినప్పటికీ, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లో 59 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 44 బంతుల్లో 68 పరుగులతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో శివమ్ దూబే 21 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కానీ భారత్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వాన పడటంతో ఇంగ్లాండ్ కనీసం ఒక్క బంతి కూడా ఆడకుండానే మ్యాచ్ రద్దయింది.

ALSO READ : వైభవ్‌ డెబ్యూకు గ్రీన్ సిగ్నల్?.. ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టీ20లో భారత్ ప్లేయింగ్ XI ఇదేనా!

వైభవ్ అరంగేట్రం.. సచిన్ రికార్డు బద్దలయ్యేనా?: 
ఒకవేళ మాంచెస్టర్‌లో వాతావరణం అనుకూలించి మ్యాచ్ గనుక సజావుగా సాగితే, అందరి కళ్లూ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీపైనే ఉండనున్నాయి. ఇటీవలే ఐర్లాండ్ పర్యటనలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి వైభవ్‌కు అవకాశం ఇస్తారని భావించినప్పటికీ, మేనేజ్‌మెంట్ ఆ సాహసం చేయలేకపోవడంతో భారత్ ఆ సిరీస్‌ను 2–0తో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో గనుక వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే ఛాన్స్ (Debut Cap) దక్కితే.. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి భారత పురుషుల క్రికెట్ చరిత్రలోనే అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.