హైదరాబాద్ లో వానోస్తే వరదలే.. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం.. మాన్సూన్ టీమ్స్ లేక తిప్పలు

హైదరాబాద్ లో వానోస్తే వరదలే.. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం..  మాన్సూన్ టీమ్స్ లేక తిప్పలు
  • వరద సహాయక చర్యలు ఆలస్యం 
  • బల్దియా టెండర్లపై ఆరోపణలు రావడంతో  హైడ్రాకు టీమ్స్​ బాధ్యతలు అప్పగించిన సర్కారు
  • మళ్లీ టెండర్లు పిలిచిన హైడ్రా
  • వెస్ట్​ సిటీ ఘటనతో బయటపడిన లోపం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈసారి పలు కారణాలతో మాన్సూన్​టీమ్స్​ఏర్పాటు చేయకపోవడంతో గురువారం కురిసిన వర్షానికి జనం తిప్పలు పడాల్సి వచ్చింది. మెయిన్​రోడ్లపై, అండర్​పాస్​ల వద్ద, మిగతా ప్రాంతాల్లో నీరు నిల్వడంతో క్లియర్​చేయడానికి గంటల సమయం పట్టింది. మాన్సూన్​టీమ్స్​లేకపోవడంతో హైడ్రా డీఆర్​ఎఫ్ బృందాలు వచ్చి ఆ పని చేశాయి.  ఇప్పటికే మాన్సూన్​టీమ్స్​ఏర్పాటు కావాల్సి ఉన్నా.. బల్దియా నిర్లక్ష్యం, అందులోని కొందరు అధికారుల అవినీతి ఈ డిలేకు కారణమయ్యాయి. 

51 డీఆర్ఎఫ్​ బృందాలతోనే..

ముందు మేల్కొనని బల్దియా మాన్సూన్ టీమ్స్ కోసం ఆలస్యంగా టెండర్లను పిలిచింది. ఇందులోనూ అవినీతి ఆరోపణలు రావడంతో సర్కారు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మాన్సున్ టీమ్స్ బాధ్యతలను బల్దియా నుంచి తొలగించి హైడ్రాకు అప్పగించింది. అయితే, ఇప్పటికే వర్షాలు మొదలై పలుచోట్ల నీరు నిలుస్తుండడంతో హైడ్రా డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఉన్న 51 బృందాలతో మహానగరంలో అంతటా సహాయక చర్యలు అందించడం సాధ్యం కావడం లేదు. 

130 మాన్సూన్​ఎమర్జెన్సీ టీమ్స్ కోసం హైడ్రా టెండర్లను పిలిచినా, జూలై నెలలోనే ఈ తంతు పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నది. హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు ఉన్నా ఈ టీమ్స్ గ్రేటర్ లో మాత్రమే పనిచేయనున్నాయి. టీమ్స్​ ఏర్పాటయ్యే వరకు భారీ వర్షాలు కురిస్తే ఎలా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. పైగా, గతంలో 300కు పైగా మాన్సూన్​టీమ్స్ ఉన్నా అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని, వచ్చే 130 టీమ్స్​సరిపోవంటున్నారు.
 

ఎవరికి వారే సహాయక చర్యలు..

వెస్ట్​సిటీలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి జనం ఇబ్బందులు పడ్డారు. మెయిన్​రోడ్లపై చేరిన వరదను మధ్యాహ్నం వరకు కూడా తొలగించలేదు. లింగంపల్లి రైల్వే అండర్ పాస్, చందానగర్ రైల్వే అండర్ పాస్ లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో కొద్దిగంటల పాటు రాకపోకలు బందయ్యాయి. పాపి రెడ్డి కాలనీ నుంచి చందానగర్ - లింగంపల్లి వెళ్లేందుకు ఉన్న రోడ్లు కూడా వరదతో నిండగా, ట్రాఫిక్​ఇబ్బందులు తలెత్తాయి. కొద్దిసేపట్లోనే భారీ వర్షం కురిసినా, మాన్సూన్​టీమ్స్​ఉంటే కొంచం ఇబ్బందుతు తప్పేవని స్థానికులంటున్నారు.

గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ పాస్ వద్ద నీరు చేరడంతో రాకపోకలు బందయ్యాయి. గత వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి ఎదురుకాగా, మాన్సూన్​ టీమ్స్​ రెండు గంటల్లోనే క్లియర్​ చేశాయి. అర్ధరాత్రి, తెల్లవారుజామున ఎప్పుడైనా టీమ్స్ అందుబాటులో ఉండేవి. కానీ, ఇప్పుడు టీమ్స్ ఏర్పాటు చేయకపోవడంతో హైడ్రా డీఆర్ఎఫ్​ బృందాలు ఉదయం 9 గంటలకు వచ్చి నీటిని తొలగించాయి.  

చందానగర్, మియాపూర్, ఛత్రినాక, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో గురువారం వర్షానికి మెయిన్ ​రోడ్లపై వరద చేరగా, మధ్యాహ్నం వరకూ క్లియర్​ చేయలేదు. మాన్సున్ టీమ్స్ ఉన్న సమయంలో 24 గంటల పాటు టీమ్స్ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు క్లియర్ ​చేసేవారు. ప్రస్తుతం ఈ రోడ్లపై మోకాళ్లలోతు నీరు గంటల తరబడి ఉండడంతో జనం ఇబ్బందులు పడ్డారు.