ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనం కారణంగా తెలంగాణలో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈనెల 26న అండమాన్ దీవులకు సమీపంలో కేంద్రీకృతం కానున్న అల్పవాయుపీడనం 27వ తేది మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దాని ప్రభావం వల్ల కూడా తెలంగాణలో నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు , ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
ఈశాన్య, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని.. రాబోయే నాలుగైదు రోజుల (నవంబర్ 26,27,28,29,30) పాటు తెలంగాణలో మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రావణి పేర్కొన్నారు. ఈశాన్య జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జనగాం, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈనెల 26, 27న దక్షిణ అండమాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఇది మరింత బలపడి అల్పపీడనం ఈనెల 27, 28వ తేదీ వరకు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పారు. దీంతో కర్ణాటక, కేరళ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రావణి వెల్లడించారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ప్రభావం కూడా ఉండనుంది.. తెలంగాణపై ప్రభావం తక్కువ ఉండనున్నట్లు తెలిపారు. ఈ వర్ష ప్రభావం వల్ల రెండు రోజులు ( 27,28) ఉదయం పూట ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు వెల్లడించారు.