ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ అభివృద్ధి చెందిందని నమ్మితే నటులు వివేక్ ఒబెరాయ్, ఆర్. మాధవన్ దుబాయ్లో ఎందుకు స్థిరపడ్డారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) చీఫ్రాజ్ థాకరే ప్రశ్నించారు. దేశంలో వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్లే వేలాది మంది పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మూసేసి విదేశాలకు వెళ్లిపోతున్నారని ఆరోపించారు. ఈమేరకు శనివారం ముంబైలో ఎమ్ఎన్ఎస్ విద్యార్థి విభాగం ‘మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన’ నిర్వహించిన కార్యక్రమంలో రాజ్ థాకరే కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘ప్రధాని మోదీ బయోపిక్ తీసి, అందులో ఆయన పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్ కూడా ఇప్పుడు దుబాయ్ వెళ్లిపోయారు. పీఎం మోదీని ప్రశంసించిన మాధవన్ కూడా దుబాయ్లోనే ఉంటున్నారు. భారత్పై అంత ప్రేమ ఉంటే, పీఎం మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని నమ్మితే , మరి వారు కుటుంబాలతో సహా దుబాయ్కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు?.. ప్రభుత్వ స్పాన్సర్డ్ సినిమాల్లో నటించేందుకు మాత్రమే వారు వస్తారు, పూర్తయ్యాక తిరిగి వెళ్తారు” అని ఆరోపించారు. అయితే, కోవిడ్ టైంలో తన కుమారుడి స్విమ్మింగ్ శిక్షణ కోసం దుబాయ్కి మారానని మాధవన్, వ్యాపారం కోసం వెళ్లినట్లు వివేక్ ఒబెరాయ్ గతంలో వెల్లడించారు.
