హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధును ఈసీ అడ్డుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత బంధును ఎవరూ ఆపలేరని నవంబర్ 4 తర్వాత తానే స్వయంగా వెళ్లి దళిత బంధు ఇస్తానని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతె బీజేపీ నేతలు ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పినట్టుగా దళిత బంధును అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దళిత బంధును..కేసీఆర్ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నవంబర్ 4 తర్వాత దళిత బంధును ఎవరు ఆపలేరు అని గొప్పగా సీఎం ప్రకటించారని.. నవంబర్ 4వ తేదీ అయిపోయినా.. ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. మీ పార్టీ ప్లీనరీలో ఎన్నికల కోసం దళిత బంధు తేలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. నా నియోజకవర్గంలోని దళితులు మీ దళిత బంధు కోసం ఎదురు చూస్తున్నారు అంటూ తెలిపారు. ఎన్నికలు అయిపోయాయని వెంటనే రాష్ట్రమంతా దళిత బంధుని అమలు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.