నేను చెప్పేది వినే ధైర్యం టీఆర్ఎస్‌కు లేదు

నేను చెప్పేది వినే ధైర్యం టీఆర్ఎస్‌కు లేదు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ మొదటిరోజు మాట్లాడారు. రెండోరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సాగుతోంది. గవర్నర్ ప్రసంగంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. డబ్బు పెట్టి గెలవడం గొప్ప అనుకుంటున్నారా.. అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదు. తెలంగాణలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు. ప్రశ్నించే వారిని అరెస్టు చేయించేవాడు ఉద్యమకారుడా? గవర్నర్ చేత సర్కార్ అబద్దాలు చెప్పించింది. కార్పొరేట్ ఆస్పత్రులు పేదవాళ్ల రక్తం తాగుతున్నాయి. ఊళ్లలో స్కూల్స్‌కు కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వం ఏ లెక్కన కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది? తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది. ప్రజలు ఇచ్చిన హక్కుతో నేను మాట్లాడుతున్నాను. అంతేకానీ ఇది నాకు టీఆర్ఎస్ వాళ్లు ఇచ్చిన బిక్ష కాదు. కౌరవులు 100 మంది.. పాండవలు అయిదుగురు ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ వాళ్లు 100 మంది, కాంగ్రెస్ వాళ్లు అయిదుగురున్నారు. బీఎసీ మీటింగ్‌లో నా పేరు మొదట ఉంటే దాన్ని రెండో దానికి మార్చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రా లేకపోతే కొంత ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ… పాలమూరు ప్రాజెక్టు మీద ఎందుకు లేదు? ఎమ్మెల్యేలు, మంత్రులు భజనపరులుగా మారొద్దు. నిజాలు ముఖ్యమంత్రికి చెప్పాలి. అబద్దాలు ఎన్ని రోజులు చెబుతారు. ఆరోగ్య శ్రీ, ఫ్రీ కరెంట్, పలు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఎర్రబెల్లి, చింతమడక, సిద్ధిపేటలో డబుల్ బెడు రూం ఇండ్లు కడితే తెలంగాణ మొత్తం కట్టినట్లేనా? టీఆర్ఎస్ వాళ్లు చెప్పిన లెక్కలు ఎలా ఉన్నాయంటే.. ఆహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని తాడుకు కట్టి అన్నం తిన్నట్లు.. ఈ ప్రభుత్వం కూడా కొన్ని ఇండ్లు కట్టి అందరికీ ఇచ్చినట్లు చెబుతుంది. డబుల్ బెడ్ రూం మీరు ఎలాగు కట్టలేరు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని.. ప్రజలు సింగిల్ బెడ్ రూం కట్టుకోవడానికి రెండు లక్షల రూపాయలు మంజూరుచేయాలి.  మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. కానీ.. ఇప్పటికీ ఇవ్వలేకపోయారు. కేసీఆర్‌ అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఆయనంటే నాకు ఎప్పటికీ గౌరవమే. మధ్యలో వచ్చిన వాళ్లే ఆగుతలేరు’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

For More News..

పుల్వామా ఎటాక్: బాంబు తయారీకి కావలసిన వస్తువులు అమెజాన్‌లో కొన్న నిందితులు

నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

నిర్భయ కేసులో కొత్త ట్విస్ట్‌

కేటీఆర్ నమస్తే.. హరీశ్ షేక్ హ్యాండ్..

‘మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు.. ఎన్నికల్లో కోట్లు సంపాదించాడు’