బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

త్వరలోనే బీజేపీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరుతారని, ఎప్పుడు చేరేది ఆయన చెబితే గాని తెలుస్తుందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బండి సంజయ్ తో v6 మాట్లాడింది. రాజగోపాల్ రెడ్డితో పాటు చాలా మందిని బీజేపీలోకి తీసుకొచ్చే విషయంలో జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారని.. ఒక విధంగా రిస్క్ కూడా తీసుకుంటున్నారని వివరించారు. మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా, మోడీకి మద్దతు తెలియచేస్తూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్లు గుర్తు చేశారు. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోందన్నారు. వివేక్ వెంకట స్వామితో తాను మాట్లాడినట్లు తెలిపారు.

రాజగోపాల్ రెడ్డితో వివేక్ మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. పార్టీలో చేరేది రాజగోపాల్ రెడ్డి చెబితేనే తెలుస్తుందన్నారు. మొదటి, రెండు విడతల ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైందన్నారు. బీజేపీ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, మూడో విడత యాత్ర ప్రారంభమయ్యే యాదగిరిగుట్ట, ముగింపు జరిగే వరంగల్ కు జాతీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ 17 విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో వారే గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎందుకు జరపడం లేదు ? ఎంఐఎంకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తప్పకుండా జరుపుతామన్నారు.