4 లక్షల మందితో ప్రగతి భవన్‭ని ముట్టడిస్తా: రాజగోపాల్ రెడ్డి

4 లక్షల మందితో ప్రగతి భవన్‭ని ముట్టడిస్తా: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎన్నికలో గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేశారో  అందరికీ తెలుసని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గొల్లకురుమ సోదరులను మోసం చేసినందుకు పోరుబాట మొదలు పెట్టామని చెప్పారు. గొల్ల కురుమ సోదరులకు గొర్ల కోసం డబ్బులు ఇస్తున్నామని.. 7,540 మంది అకౌంట్‭లో డబ్బులు వేశారని గుర్తుచేశారు. అయితే అకౌంట్‭లో డబ్బులు వేసినట్టే వేసి ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. గొల్ల కురుమ సోదరుల అనుమతి లేకుండా అకౌంటు ఎలా ఫ్రీజ్ చేస్తారని ప్రశ్నించారు. ఫ్రీజ్ చేసిన మొత్తం డబ్బులను విడుదల చేయాలని పోరుబాట ద్వారా డిమాండ్ చేస్తున్నామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. డబ్బులు విడుదల చేయకపోతే  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  నాలుగు లక్షల మందితో.. ప్రగతి భవన్‭ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే.. దళితబంధు హామీ ఇచ్చేంతవరకు తమ పోరు ఆగదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడే.. కేసీఆర్ కు భయం పట్టుకుందని రాజగోపాల్ విమర్శించారు. ఒక్క ఎమ్మెల్యేని ఓడించడానికి వంద మందిని పంపించి.. ప్రజలకు డబ్బులు చూపించి ప్రలోభాలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోరుబాట ఉద్యమం టీఆర్ఎస్ ను బొంద పెడుతుందని అన్నారు. మునుగోడు ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని... ఉపఎన్నిక సమయంలో మీరు చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదని చెప్పారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి నిరసన చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమలను మోసం చేసిందంటూ బీజేపీ ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.