ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో పంజాబ్పై గెలిచింది. టాస్ ఓడిన పంజాబ్ 20 ఓవర్లలో 222/4 స్కోరు చేయగా.. రాజస్తాన్ 19.2 ఓవర్లలో 228/4 స్కోరు చేసి గెలిచింది.
చండీగఢ్:
ఐపీఎల్–19లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మెగా లీగ్లో ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్తున్న ఆ టీమ్కు రాజస్తాన్ రాయల్స్ చెక్ పెట్టింది. ఛేజింగ్లో డొనోవాన్ ఫెరీరా (26 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్), యశస్వి జైస్వాల్ (27 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 51), వైభవ్ సూర్యవంశీ (16 బాల్స్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 43), దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో పంజాబ్పై గెలిచింది.
టాస్ ఓడిన పంజాబ్ 20 ఓవర్లలో 222/4 స్కోరు చేసింది. మార్కస్ స్టోయినిస్ (22 బాల్స్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 62 నాటౌట్), ప్రభ్సిమ్రన్ సింగ్ (44 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. తర్వాత రాజస్తాన్ 19.2 ఓవర్లలో 228/4 స్కోరు చేసి గెలిచింది. ఫెరీరాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
- ‘టాప్’ లేపారు
ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు స్టార్టింగ్లో ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ ఆర్యా (29) మెరుపు ఆరంభాన్నిస్తే.. చివర్లో స్టోయినిస్ అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు. తొలి ఓవర్లో ప్రభ్ రెండు ఫోర్లతో ఆట మొదలుపెడితే.. బర్గర్ (1/59) వేసిన రెండో ఓవర్లో ప్రియాంశ్ 4, 6, 4, 4తో 21 రన్స్ దంచాడు. కానీ మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి ఆర్చర్ (1/40)కు వికెట్ ఇచ్చుకున్నాడు. ప్రభ్తో జతకలిసిన కనోలి (30 ) కూడా బ్యాట్ ఝుళిపించడంతో పవర్ప్లేలో పంజాబ్ 65/1 స్కోరు చేసింది.
ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టిన కనోలి, తర్వాతి ఓవర్లో 4, 6తో రెచ్చిపోయాడు. అయితే 9వ ఓవర్లో యష్ రాజ్ (2/41) కనోలి జోరుకు అడ్డుకట్ట వేశాడు. ఔట్సైడ్ బాల్ను భారీ షాట్కు యత్నించి లాంగాఫ్లో కనోలి.. ఫెరీరా చేతికి చిక్కడంతో రెండో వికెట్కు 59 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. తొలి పది ఓవర్లలో 107/2 స్కోరు చేసిన పంజాబ్ను ప్రభ్ మరింత ముందుకు తీసుకెళ్లాడు. 11వ ఓవర్లో రెండు ఫోర్లతో 35 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అప్పటి వరకు మెల్లగా ఆడిన శ్రేయస్ 4, 6తో టచ్లోకి వచ్చాడు.
కానీ 14వ ఓవర్లో లాస్ట్బాల్కు యష్ రాజ్.. ప్రభ్సిమ్రన్ వికెట్ తీయడంతో స్కోరు 144/3గా మారింది. ఈ దశలో వచ్చిన స్టోయినిస్ చివరి వరకు క్రీజులో ఉండి అదిరిపోయే షాట్లు కొట్టాడు. శ్రేయస్ కూడా చేయి వేయడంతో 15 ఓవర్లలో 150/3కు పెరిగింది. 16వ ఓవర్లో స్టోయినిస్ సిక్స్తో టచ్లోకి రాగా, తర్వాతి ఓవర్లో శ్రేయస్ సింగిల్స్, ఫోర్తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. 18వ ఓవర్లో 6, 4 ఇచ్చిన బర్గర్.. శ్రేయస్ను పెవిలియన్కు పంపడంతో నాలుగో వికెట్కు 37 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. చివరి రెండు ఓవర్లలో స్టోయినిస్ 6, 6, 4, 6, 6, 4, 4తో 41 రన్స్ దంచడంతో పంజాబ్ మంచి టార్గెట్ నిర్దేశించింది. ఈ క్రమంలో స్టోయినిస్ 20 బాల్స్లోనే ఫిఫ్టీ సాధించాడు.
- ఓపెనర్ల మెరుపులు.. ఫెరీరా ముగింపు
ఛేజింగ్లో రాజస్తాన్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించాడు. 6, 4, 4తో ఖాతా ఓపెన్ చేసిన వైభవ్.. ఫెర్గూసన్ వేసిన రెండో ఓవర్లో 4, 6, 6 కొట్టాడు. అర్ష్దీప్ వేసిన నాలుగో ఓవర్లో మరో సిక్స్ కొట్టి ఔటవగా తొలి వికెట్కు 20 బాల్స్లోనే 51 రన్స్ వచ్చాయి. ఇదే ఓవర్లో యశస్వి 4, 6, 4 దంచడంతో మొత్తం 22 రన్స్ వచ్చాయి. రెండో ఎండ్లో ధ్రువ్ జురెల్ (16) స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఆరో ఓవర్లో యశస్వి 4, 6, 4తో 16 రన్స్ రాబట్టడంతో పవర్ప్లేలో రాయల్స్ 84/1 స్కోరు చేసింది.
తర్వాతి ఓవర్లలో ఫోర్లు కట్టడి చేయడంతో రన్రేట్ కాస్త నెమ్మదించింది. దీంతో ఒత్తిడికి లోనైన జురెల్ 10వ ఓవర్లో చహల్ (3/36)కు వికెట్ ఇచ్చాడు. రెండో వికెట్కు 54 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. కెప్టెన్ పరాగ్ (29)తో కలిసి జైస్వాల్ తొలి పది ఓవర్లలో రాజస్తాన్కు 109/2 స్కోరు అందించాడు. ఇక ఫర్వాలేదనుకుంటున్న దశలో చహల్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో జైస్వాల్, పరాగ్ను ఔట్ చేశాడు. 26 బాల్స్లో యశస్వి ఫిఫ్టీ పూర్తి చేసుకోగా, స్కోరు 151/4గా మారింది. 15వ ఓవర్లో ఫెరీరా మూడు ఫోర్లు బాదగా, తర్వాతి ఓవర్లో శుభమ్ దూబే (31 నాటౌట్) 6, 4, 4తో టచ్లోకి వచ్చాడు. 18వ ఓవర్లో ఫెరీరా 6, 4, దూబే 6తో విజయ సమీకరణం 12 బాల్స్లో 18 రన్స్గా మారింది. ఫెరీరా 4, 6, 4,6 కొట్టి మ్యాచ్ ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్ 20 ఓవర్లలో 222/4 (స్టోయినిస్ 62 నాటౌట్, ప్రభ్సిమ్రన్ 59, యష్ రాజ్ 2/41).
రాజస్తాన్: 19.2 ఓవర్లలో 228/4 (ఫెరీరా 52 నాటౌట్, యశస్వి 51, వైభవ్ 43, చహల్ 3/36).

