రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తికి కావాల్సిన బ్లడ్ గ్రూప్ కు బదులుగా మరో బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించారు. కాసేపటికే అతను మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 23 ఏళ్ల సచిన్ శర్మ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో చేరాడు. చికిత్స సమయంలో ట్రామా సెంటర్లో ఒక వార్డ్ బాయ్ అవసరమైన O పాజిటివ్ రక్తానికి బదులుగా AB పాజిటివ్ రక్తాన్నిఎక్కించాడు. దీంతో రక్తం ఎక్కిన కాసేపటికే సచిన్ శర్మ చనిపోయాడు.
రక్తమార్పిడి తరువాత రోగి రెండు మూత్రపిండాలుపాడైపోయాయి. దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక అందిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని హాస్పిటల్ సూపరింటెండెంట్ అచల్ శర్మ తెలిపారు. ఇంతకుముందు 2022లో, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా మౌసంబి జ్యూస్ ఇచ్చిన కారణంగా రోగి మరణించాడు. ఈ ఘటన తర్వాత ఆసుపత్రికి సీలు వేయగా, ఈ కేసుపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.