
చెన్నై: సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఊరేగింపుపై తాను చేసిన కామెంట్స్కు కట్టుబడి ఉంటానని సూపర్స్టార్ రజనీకాంత్ చెప్పారు. దీనిపై తాను బాధపడనని, సారీ చెప్పనని స్పష్టంచేశారు. తాను చేసిన కామెంట్స్లో ఎలాంటి అబద్ధంలేదని పోయెస్ గార్డెన్లోని తన ఇంట్లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రజనీ వివరించారు. సీతారాముడి విగ్రహాలను అభ్యంతరకరమైన రీతిలో పెరియార్ 1971లో ఊరేగించినట్టుగా చెబుతున్న మేగజైన్, న్యూస్పేపర్ల క్లిప్పింగ్లను రజనీ మీడియాకు చూపించారు. విన్నదీ, మేగజైన్లలో ప్రచురించింది మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. దీనికి తాను సారీ చెప్పనని తెలిపారు. “ఊహించి నేనేమీ చెప్పలేదు. లేనిదీ కూడా చెప్పలేదు.
పెరియార్ ఊరేగింపులో పాల్గొన్న లక్ష్మణన్ ( అప్పట్లో జనసంఘ్, ఇప్పుడు బీజేపీ నాయకుడు) కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు ”అని రజనీ వివరించారు. “అది సులువుగా మర్చిపోయేటంత అంశంకాదు. అయితే అది కచ్చితంగా మర్చిపోవాల్సిన ఇష్యూ ”అని రజనీ చెప్పారు. ఈ నెల 14న తమిళ మేగజైన్ తుగ్లక్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ పెరియార్ ఊరేగింపు అంశాన్ని ప్రస్తావించారు. అభ్యంతరకరంగా ఉన్న సీతారామచంద్రమూర్తి, సీతాదేవి విగ్రహాలను సేలంలో పెరియార్ ఆధ్వర్యంలో 1971లో ఊరేగించినట్టు రజనీ చెప్పడం వివాదంగా మారింది. అబద్ధాలు చెప్పిన సూపర్స్టార్ సారీ చెప్పాలని ద్రవిడార్ విదుతులై కజగం డిమాండ్ చేసింది. ఆయనపై చర్య తీసుకోవాలని పోలిస్ స్టేషన్లో కేసు పెట్టింది. పెరియార్ గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని రజనీకి డీఎంకే చీఫ్ స్టాలిన్ సలహా ఇచ్చారు.