కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో డేంజరస్‌‌గా రాజీవ్ రహదారి..41 డేంజర్స్పాట్స్ గుర్తింపు

కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో డేంజరస్‌‌గా రాజీవ్ రహదారి..41 డేంజర్స్పాట్స్ గుర్తింపు
  • ఏటా రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు  
  • జంక్షన్లలో సిగ్నల్స్​, హైమాస్ట్​ లైట్లనూ పట్టించుకోవట్లే 
  • బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలు, స్పీడ్​గన్స్​ఏర్పాటుకు 
  • పోలీస్​శాఖ ఏర్పాట్లు
  • 20 ఏండ్లుగా విస్తరణ పనులు చేయకపోవడమే కారణం

​పెద్దపల్లి, వెలుగు:  కరీంనగర్​, పెద్దపల్లి జిల్లాల్లో రాజీవ్​హైవే డేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. రెండు జిల్లాల్లో పోలీసు శాఖ 41 డేంజర్​స్పాట్లను గుర్తించగా.. అందులో  పెద్దపల్లి జిల్లాలో 21, కరీంనగర్​ జిల్లాలో 20 ఉన్నాయి.  రోడ్డు ప్రమాదాల్లో ఏటా పెద్ద సంఖ్యలో వాహనదారులు మృత్యువాతపడుతున్నారు.  రోడ్డుకు ఇరువైపులా సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  జంక్షన్లలో సిగ్నల్స్​, హైమాస్ట్ ​ లైట్లను ఏర్పాటు చేయడం లేదు. ఈ మధ్య కాలంలో డేంజర్​ స్పాట్లలో సీసీ కెమెరాలు, స్పీడ్​గన్స్​ఏర్పాటు చేయడానికి పోలీసుశాఖ కసరత్తు చేస్తుంది. గడిచిన 20 ఏండ్లుగా రాజీవ్​ రహదారిని విస్తరించకపోవడం మూలంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

రాజీవ్​ హైవే  హైదరాబాద్​నుంచి కరీంనగర్​ మీదుగా పెద్దపల్లి, గోదావరిఖని నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఇందారం క్రాస్​లో ఉన్న గ్రీన్​ ఫీల్డ్​ హైవేతో కలుస్తుంది.  2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 ఏండ్లుగా ఎలాంటి విస్తరణ లేకపోవడంతో పట్టణాల మీదుగా పొతున్న రహదారిపైకి దుకాణాలు చేరాయి.  కరీంనగర్​, పెద్దపల్లి జిల్లాల పరిధిలో  దాదాపు 100  కిలో మీటర్ల పరిధిలో రాజీవ్​ రహదారి ఉంది.  పెద్దపల్లి 55 కిలోమీటర్లు, కరీంనగర్​45 కిలో మీటర్లు విస్తరించి ఉంది. మరమ్మతుల పేరిట ప్యాచ్​వర్క్​చేసి వదిలేస్తున్నారని ఆర్​అండ్​బీపై ఆరోపణలున్నాయి.  జిల్లాను ఆనుకొని పోతున్న గ్రీన్​ఫీల్డ్​ హైవేకు రాజీవ్​ రహదారిని అనుసంధానించి జాతీయ హోదా కల్పించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

డేంజర్​ స్పాట్స్​...

మొత్తం 41 బ్లాక్ స్పాట్ లను అధికారులు గుర్తించగా.. కరీంనగర్​పరిధిలో నుస్తులాపూర్​, తిమ్మాపూర్​, అలుగునూర్​,  సుల్తానాబాద్​ మండల పరిధిలోని భూపతిపూర్​, కాట్నపల్లి, దుబ్బపల్లి, గర్రెపల్లి, సుగ్లాంపల్లి, సుల్తానాబాద్​ ఉన్నాయి. పెద్దపల్లి మండల పరిధిలో  అప్పన్నపేట, పెద్ద కల్వల, రంగంపల్లి, శాంతినగర్​, మంథని ఆర్​ఓబీ, రాయపట్నం రోడ్​, బంజేరుపల్లి, కటికనపల్లి, ధర్మారం క్రాస్​ రోడ్​, రామగుండం మండల పరిధిలో మేడిపల్లి సెంటర్, ఐఓసీ, బీ పవర్​హైజ్​, రామగుండం మున్సిపల్​ ఆఫీస్​ క్రాస్​, గోదావరిఖని బస్టాండ్​, గంగానగర్​, పెద్దపల్లి నుంచి మంథని రోడ్​లోని సబ్బితం ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ స్పాట్లలో ఏటా పెద్ద సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా రాజీవ్​ రహదారిపై రోడ్డు విస్తరణ, బైపాస్​ రోడ్ల నిర్మాణం గురించి కాంగ్రెస్​ సర్కార్​ దృష్టి సారించింది. కానీ రోడ్డు వైడనింగ్​పై రోడ్డు పక్కన ఉన్న ఆస్తుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​

ప్రమాదాల నివారణకు...

ప్రమాదాల నివారణ కోసం ఆయా శాఖలు చర్యలు మొదలు పెట్టాయి. పోలీసుశాఖ గుర్తించిన డేంజర్​ స్పాట్లలో  తాత్కాలిక విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రతీ జంక్షన్​లో సిగ్నల్స్​ తో పాటు హైమాస్ట్​ లైట్లు, సైన్​ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డేంజర్​ స్పాట్లలో రోడ్లపై ఉన్న  చెట్లు, మొక్కలను తొలగించే ప్లాన్​ చేశారు. ప్రతీ మూల మలుపు వద్ద రేడియం బోర్డులు ఏర్పాటు చేయనున్నారు,  వాహనదారుల స్పీడ్​ నియంత్రించడానికి డేంజర్​ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలతో పాటు స్పీడ్​ గన్స్​ ఏర్పాటు చేసినట్లు పోలీసుశాఖ స్పష్టం చేసింది.  

అంతే కాకుండా జిల్లాలోని రెండు ప్రధాన పట్టణాలు పెద్దపల్లి, సుల్తానాబాద్​లకు సంబంధించి బైపాస్​ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయి. కానీ వాటి కార్యచరణ మాత్రం ముందుకు సాగడం లేదు. బైపాస్​ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.