
- డబుల్ బెడ్రూమ్ రూ.25 లక్షలు
- పోచారం సద్భావన టౌన్షిప్లో ఫిక్స్ రేట్లు
- ఎండీ వి.పి. గౌతమ్
ఘట్కేసర్, వెలుగు: పోచారంలోని సద్భావన టౌన్షిప్లో మిగిలిన ఫ్లాట్లను పేద, మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరల్లో విక్రయిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ తెలిపారు. పోచారం టౌన్షిప్ను బుధవారం ఆయన సందర్శించి, ఫ్లాట్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన రోడ్లు, మధ్యలో ఖాళీ స్థలం, మంచి వెంటిలేషన్తో నిర్మించిన ఈ టౌన్షిప్లో ఇప్పటికే వెయ్యికి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు.
పోచారంలో మిగిలిన 255 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు రూ.13 లక్షలకు, 340 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను రూ.25 లక్షలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవన్నీ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉప్పల్– నారపల్లి ఫ్లైఓవర్ పూర్తయితే టౌన్షిప్కు 10 నిమిషాల ప్రయాణమని, ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఫ్లాట్లు ఉన్నాయన్నారు. బహిరంగ మార్కెట్లో ఫ్లాట్ల ధరలు రూ.50 లక్షలకు తక్కువ లేవని, ఈ అవకాశాన్ని మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దరఖాస్తుదారుల నుంచి టోకెన్ అడ్వాన్స్ తీసుకొని, లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. బండ్లగూడ సహభావన టౌన్షిప్లోనూ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని, పూర్తి వివరాలకు www.swagruha.telangana.gov.in వెబ్సైట్ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఆయన వెంట అధికారులు భాస్కర్, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, బాలాజీ తదితరులు ఉన్నారు.