
భోపాల్: మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని, మన ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. భారత్ సూపర్ పవర్గా ఎదగకుండా ప్రపంచంలోని ఏ పవర్ కూడా అడ్డుకోలేదని తేల్చి చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాయ్సేన్ జిల్లాలో రూ.1,800 కోట్లతో బీఈఎంఎల్ ఏర్పాటు చేస్తున్న రైల్వే కోచ్ మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్కు రాజ్నాథ్ సింగ్ ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్పై భారీ టారిఫ్లు విధించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్పై ఫైర్ అయ్యారు.
‘‘ప్రపంచమంతటికీ మేమే బాస్ (అమెరికా) అనుకునేటోళ్లకు భారత్ ఎదగడం నచ్చడం లేదు. అందుకే మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. మనం ఎగుమతి చేస్తున్న వస్తువులపై భారీ టారిఫ్లు విధించి, అవి మరింత ఖరీదయ్యేలా చేస్తున్నారు” అని మండిపడ్డారు. ఎవరెన్ని చేసినా భారత్ ఎదుగుదలను ఆపలేరని తేల్చి చెప్పారు. ‘‘ప్రస్తుతం ప్రపంచంలో డాషింగ్ అండ్ డైనమిక్ ఎకానమీ ఏదైనా ఉందంటే.. అది ఇండియన్ ఎకానమీనే. మనం సూపర్ పవర్గా ఎదగకుండా ఏ గ్లోబల్ పవర్ కూడా అడ్డుకోలేదు” అని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2014లో భారత్ స్థానం 11. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. మన గ్రోత్ రేట్ 6.3 శాతంగా ఉంది. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం.. ప్రపంచంలో మరొకటి లేదు” అని పేర్కొన్నారు.
డిఫెన్స్ సెక్టార్లో స్వయం సమృద్ధి..
ఆపరేషన్ సిందూర్ విజయంలో మేడిన్ ఇండియా డిఫెన్స్ పరికరాలు కీలక పాత్ర పోషించాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. డిఫెన్స్ సెక్టార్లో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. ‘‘మనం ఒకప్పుడు డిఫెన్స్ పరికరాలు విదేశాల నుంచి ఎక్కువగా కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు చాలా వరకు మన దేశంలోనే తయారు చేసుకుంటున్నం. మన అవసరాలను తీర్చుకోవడంతో పాటు విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నం. 2014లో రూ.600 కోట్లు ఉన్న డిఫెన్స్ ఎగుమతులు.. ఇప్పుడు రూ.24 వేల కోట్లకు చేరాయి. ఇదీ ఇండియా పవర్. ఇది న్యూ ఇండియాలోని న్యూ డిఫెన్స్ సెక్టార్” అని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై స్పందిస్తూ.. మమ్మల్ని రెచ్చగొట్టేవాళ్లను వదిలిపెట్టమని హెచ్చరించారు. వాళ్లకు ఆపరేషన్ సిందూర్తో తగిన బుద్ధి చెప్పామన్నారు.