- సంస్థల్ని బ్యాన్ చేస్తే చాలు వ్యక్తులపై ముద్రలొద్దు: కాంగ్రెస్
- వేరే సంస్థల్లో చేరి కుట్రలు చేస్తారు కాబట్టే వ్యక్తుల్నీ టెర్రరిస్టులుగా ప్రకటించాలి: అమిత్ షా కౌంటర్
- హోం మంత్రి విమర్శలు చేసినా సర్కారుకే మద్దతిచ్చిన కాంగ్రెస్
- ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందన్న లెఫ్ట్
న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) సవరణ బిల్లుకు శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్ని ఇకపై టెర్రరిస్టులుగా ప్రకటించే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పించే ఈ కీలక బిల్లుకు అనూహ్యరీతిలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు మద్దతు తెలిపాయి. టెర్రరిస్టు కేసుల్లో దర్యాప్తులో భాగంగా నిందితుడి వస్తువులు, ఇతర ప్రాపర్టీని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకోవచ్చనే నిబంధనను కూడా ఇందులో ఉంది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రవాగ్వాదం నడిచింది. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు సూచించిన సవరణలు వీగిపోయాయి. కాంగ్రెస్ సపోర్టుతో సవరణ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లురాగా, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. దీంతో బిల్లు పాసైనట్లు చైర్మన్ ప్రకటించారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టంగా అమలులోకి రానుంది. రాజ్యసభలో ప్రతిపక్షాల బలమే ఎక్కువున్నా, ప్రస్తుత సెషన్లో బీజేపీ సర్కార్ ఆమోదింపజేసుకున్న మూడో కీలక బిల్లు ఇది. ఇంతకుముందు ఆర్టీఐ సవరణ, ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లులూ పెద్దల సభలో పాసయ్యాయి.
వ్యక్తుల వల్లే టెర్రరిజం వ్యాప్తి: అమిత్ షా
చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ చిదంబరం మాట్లాడుతూ, ఇప్పటికే అమల్లో ఉన్న యూఏపీఏ చట్టం ప్రకారం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థల్ని టెర్రర్ గ్రూపుగా ప్రకటించే వీలుందని, అలాంటప్పుడు కొత్తగా ‘వ్యక్తులపైనా టెర్రరిస్టు ముద్ర వేసే’ సవరణ తేవాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీని ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులు హరించుకుపోయే అవకాశం ఉందన్నారు. చిదంబరం వాదనకు అడ్డుతగిలిన కేంద్ర మంత్రి అమిత్ షా.. అసలీ యూఏపీఏ చట్టాన్ని రూపొందించిందే (1967లో) కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. “చట్టాల దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదు. టెర్రరిస్టు కేసులకు ఉద్దేశపూర్వకంగా మతం రంగును పూశారు. సంజౌతా ఎక్స్ప్రెస్, మక్కా మసీదు పేలుళ్ల కేసుల్లో కోర్టు తీర్పులే అందుకు నిదర్శనం. టెర్రరిజాన్ని దేశం నుంచి తరిమేయడమే మోడీ సర్కార్ లక్ష్యం. ఒక సంస్థను నిషేధించినంత మాత్రాన సరిపోదు. అందులో పనిచేసిన వ్యక్తులు వేరే పేర్లతో మరో ఆర్గనైజేషన్లు పెట్టుకుని టెర్రరిజాన్ని వ్యాప్తి చేస్తారు. అందుకే వ్యక్తుల్ని కూడా టెర్రరిస్టులుగా గుర్తించే చట్టసవరణను మేం తీసుకొచ్చాం”అని అమిత్ షా వివరించారు.
టెర్రరిజంపై లెక్చర్లిచ్చే బీజేపీనే టెర్రరిస్టు కేసుల్లో నిందితుల్ని చట్టసభలకు పంపుతోందంటూ కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. పరోక్షంగా భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ను ఉద్దేశించి ఆయనీ కామెంట్లు చేశారు. దిగ్విజయ్ ఆరోపణల్ని తప్పుపట్టిన అమిత్ షా.. ‘‘ఎన్నికల్లో ఓడిపోయినందుకే దిగ్విజయ్ ఇంతలా కోప్పడుతున్నారు. మూడు కేసుల్లో ఎన్ఐఏ విచారణ ఎదుర్కొంటున్న మీరు(దిగ్విజయ్) కూడా ఎంపీగా ఉన్నారుకదా, యూపీఏ హయాంలో టెర్రరిజానికి మతం రంగులు పూస్తే, ప్రస్తుత ఎన్డీఏ మాత్రం టెర్రరిజం అంతానికి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నది’’అని కౌంటరిచ్చారు.
విజన్లేని కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది
బీజేపీ సర్కార్ రూపొందించిన యూఏపీఏ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచిందని, దేశం పట్ల ఆ పార్టీ విజన్ కోల్పోయిందని లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. ఫాసిస్టు ధోరణిలో మోడీ ప్రభుత్వం ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న తరుణంలో అప్రజాస్వామిక బిల్లుకు కాంగ్రెస్ మద్దతు పలకడమేంటని సీపీఐ నేత డి.రాజా ప్రశ్నించారు. యూఏపీఏ బిల్లును సపోర్ట్ చేయడం ద్వారా మైనార్టీలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని సీపీఎం నేత కరీం విమర్శించారు.
